Articles by "EDITORIAL"

Showing posts with label EDITORIAL. Show all posts

స్వీయ రక్షణ... సర్వ భక్షణ! 
భారత్‌ను దెబ్బతీస్తున్న విశ్వవాణిజ్య యుద్ధం

 
రవై ఏళ్ల క్రితం కుదిరిన రోమ్‌ ఒడంబడిక అంచెలంచెలుగా ఐరోపా సమాఖ్య (ఈయూ), ఉమ్మడి కరెన్సీ యూరో ఆవిర్భవానికి దారితీసింది. ఇదేకాలంలో ప్రపంచీకరణ విస్తరించి ప్రపంచ వాణిజ్యసంస్థ (డబ్లూటీఓ) అవతరణకు తోడ్పడింది. డబ్ల్యూటీఓలో చైనా చేరికతో అంతర్జాతీయ వాణిజ్యం వేగం పుంజుకొంది. కానీ, 2008 ఆర్థిక సంక్షోభం ప్రపంచీకరణపై వ్యతిరేకత పెంచి ఈయూ నుంచి బ్రిటన్‌ నిష్క్రమణకు, అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయానికి మూలకారణమైంది. అంతర్జాతీయ వాణిజ్యం, సంబంధిత కార్యకలాపాల వల్ల తాము నష్టపోతున్నామనే భావన బ్రిటన్‌, అమెరికా ప్రజల్లో వేళ్లూనుకోవడం వల్ల ఈ పరిణామాలు సంభవించాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో అందరూ బాగుపడతారు తప్ప, ఏ ఒక్కరో లబ్ధిపొందరన్న వాస్తవాన్ని ఓటర్లు గుర్తించలేదని అమెరికా, బ్రిటన్‌ పరిణామాలు సూచిస్తున్నాయి. ఈ అవాస్తవిక మనోభావాలు బ్రెగ్జిట్‌, ట్రంప్‌ విజయాలకు హేతువయ్యాయి. చిత్రంగా ట్రంప్‌ విజయం తరవాత విజేతలు, పరాజితులు; చిన్నా పెద్ద దేశాలు అనే తేడా లేకుండా అందరికీ ఆదుర్దా పట్టుకొంది. భారతదేశమూ దీనికి మినహాయింపు కాదు. నేడు కీలక మలుపులో ఉన్న భారత ఆర్థిక భవిష్యత్తు అనిశ్చితికి లోనవుతోంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా వాణిజ్య సమరానికి సిద్ధం కావడం దీనికి కారణం. డబ్ల్యూటీఓ నిర్ణయాలకు తలొగ్గాల్సిన అవసరం అమెరికాకు లేదని, ఒక సార్వభౌమ దేశంగా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రాధాన్యమిస్తామని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఇటీవల స్పష్టీకరించడం పెద్ద అశుభ సంకేతం. అమెరికా ఇదే పంథాలో సాగితే ప్రపంచానికి 1930నాటి మహా కుంగుబాటు మళ్ళీ దాపురిస్తుంది. అప్పట్లో ప్రపంచ దేశాలు పోటాపోటీగా దిగుమతి సుంకాలు పెంచేయడంతో అందరి ఎగుమతులు దెబ్బతిని, వాణిజ్య యుద్ధం విజృంభించింది. అంతర్జాతీయ వాణిజ్యం కుదేలై ప్రపంచం ఆర్థిక మాంద్యం ముంచుకొచ్చింది. అన్ని దేశాలు తమ వాణిజ్యం విస్తరించాలని, ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరించకూడదని సుద్దులు చెబుతూనే దిగుమతులపై గుట్టుగా సుంకాలు పెంచుతున్నాయి. ఇలా ఎవరికివారు స్వీయ వాణిజ్య రక్షణకు ప్రాధాన్యమివ్వడం ఎగుమతులకు విఘాతం కలిగిస్తుంది. ట్రంప్‌ విధానాల వల్ల ఈ పెడధోరణి ముదిరితే చైనాతోపాటు భారత్‌కూ నష్టమే! చివరకు అమెరికా కూడా ఆర్థికంగా అతలాకుతలమవుతుంది.
నష్టాల చక్రభ్రమణం 

వాణిజ్య యుద్ధం వల్ల ఎగుమతులపై అధికంగా ఆధారపడిన దేశాలకు ఎక్కువ నష్టం కలిగితే, తక్కువగా ఆధారపడిన దేశాలకు కాస్త తక్కువ నష్టం సంభవిస్తుంది. అసలంటూ నష్టపోని దేశాలూ ఏవీ ఉండవు.అనేక పెద్ద దేశాలకన్నా భారతదేశ ఎగుమతుల పరిమాణం తక్కువే కానీ, అవి అత్యధికులకు ఉపాధి కల్పించే రంగాల నుంచే జరుగుతున్నాయి. కాబట్టి మన ఎగుమతులు తగ్గితే ఉపాధి అవకాశాలూ తగ్గిపోతాయి. వస్తువులు ఒకేచోట తయారై అక్కడే అమ్ముడయ్యే పద్ధతి అదృశ్యమవుతోంది. వస్తూత్పత్తి ప్రక్రియ అనేక దేశాలకు విస్తరించింది. ఈ గొలుసు ప్రక్రియలో తయారైన వస్తువులు పలు దేశాల్లో విక్రయమవుతున్నాయి. ఈ సరఫరా గొలుసు గడచిన 15 ఏళ్లలో అపారంగా విస్తరించింది. అమెరికా కంపెనీలు కేవలం డిజైన్లు ఇచ్చి తమ వస్తువులను పూర్తిగానో, పాక్షికంగానో చైనాలో తయారు చేయించి దేశదేశాల్లో విక్రయించడం చూస్తూనే ఉన్నాం. అలాగే ఒక దేశం ఏదో ఒక్క దేశానికో లేక అనేక దేశాలకో ఒక వస్తువును ఎగుమతి చేస్తూ ఉండవచ్చు. కానీ, ఆ వస్తు తయారీకి కావలసిన ముడిపదార్థాలను, విడి భాగాలను వేర్వేరు దేశాల నుంచి దిగుమతి చేసుకొంటుంది. అంటే, ఒక దేశ ఎగుమతులు తగ్గిపోతే అది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు తగ్గిపోతాయి. వెరసి ఎగుమతిదారుడు, దిగుమతిదారుడు అంతా నష్టపోతారు. ఉదాహరణకు మెక్సికోను తీసుకుంటే ట్రంప్‌ విధానాలు ఆ దేశాన్ని దారుణంగా దెబ్బతీస్తాయని అవగతమవుతుంది. మెక్సికోకు ప్రధాన వాణిజ్య భాగస్వామి అమెరికాయే. మెక్సికో ఎగుమతుల్లో 72 శాతం అమెరికాకే చేరుతున్నాయి. చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలు మూడింటికీ కలిపి అయిదు శాతమే ఎగుమతి చేస్తోంది. మెక్సికో దిగుమతుల్లో అత్యధికం (49 శాతం) అమెరికా నుంచే వస్తున్నాయి. ఆ తరవాతి స్థానాలను చైనా (17 శాతం), జపాన్‌ (5), దక్షిణ కొరియా (4) ఆక్రమిస్తున్నాయి. అమెరికాకు మెక్సికో ఎగుమతులు తగ్గిపోతే, ఇతర దేశాల నుంచి అది దిగుమతి చేసుకునే సరకులూ తగ్గిపోతాయి. అంటే నష్టం ఒక్క మెక్సికోకే పరిమితం కాకుండా ఇతర దేశాలకూ పాకుతుంది.

పలు రంగాలపై పెనుప్రభావం 

భారతదేశం ప్రధానంగా సేవలనే ఎగుమతి చేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన రెండు దశాబ్దాల్లో సేవారంగం, ముఖ్యంగా సమాచార సాంకేతిక రంగంలో గరిష్ఠ ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ రంగం నుంచి ఎగుమతుల్లో సింహభాగం అమెరికాకే చేరుతున్నాయి. అమెరికా కనుక వాణిజ్య ఆంక్షలు విధిస్తే మన ఐటీ ఎగుమతులు, తద్వారా ఉపాధి అవకాశాలూ దెబ్బతినడం ఖాయం. సేవారంగ ఎగుమతులకు మూల కేంద్రాలైన బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, పుణెల అభివృద్ధి కుంటువడుతుంది. అక్కడ వస్తుసేవల వినియోగం, స్థిరాస్తి రంగం కూడా నష్టపోతాయి. అమెరికాకు ప్రత్యామ్నాయ విపణిని కనుగొనడం ఇప్పుడిప్పుడే సాధ్యమయ్యే పనికాదు. ప్రస్తుతం ఐటీ, దాని అనుబంధ రంగాలు దేశవ్యాప్తంగా కోటి మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 9.5 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. భారతదేశ ఎగుమతుల్లో 48 శాతానికి సేవా రంగమే మూలం. ఒకవేళ వాణిజ్య యుద్ధమే విరుచుకుపడితే, దాని దుష్ప్రభావం భారత్‌తో పాటు దాని వాణిజ్య భాగస్వాములపైనా పడుతుంది. 2016 ఏప్రిల్‌, 2017 ఫిబ్రవరి మధ్య కాలంలో భారత్‌ 5,347 కోట్ల డాలర్ల (రూ.3.58 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులు చేసింది. వీటిలో అత్యధికం అమెరికాకే చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత దేశ ఎగుమతులు ఎక్కువగా (19.30 శాతం) మొత్తం ఐరోపా ఖండ దేశాలకు చేరుతున్నాయి. అందులో 17.08 శాతం ఎగుమతులు ఐరోపా సమాఖ్య (ఈయూ) సభ్యదేశాలకు వెళ్తున్నాయి. మన ఎగుమతుల్లో 17.7 శాతం అమెరికాకు చేరుతున్నాయి. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలతో కూడిన ఉత్తర అమెరికా ఖండానికి 20.45 శాతం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు (11.41 శాతం), ఆగ్నేయాసియా దేశాల సంఘం ఆసియాన్‌కు 10.82 శాతం భారతీయ ఎగుమతులు చేరుతున్నాయి. ఇంకా మన ఎగుమతులు సింగపూర్‌ (3.15 శాతం), హాంకాంగ్‌ (4.8), చైనా (3.85 శాతం)లకు వెళ్తున్నాయి. మొత్తం మీద భారతదేశ ఎగుమతుల్లో 49 శాతం ఆసియా దేశాలకు చేరుతున్నాయి. ఇక మన దిగుమతుల్లో అత్యధికం చైనా (16.44 శాతం) నుంచి వస్తున్నాయి. జర్మనీ నుంచి 10.97 శాతం, ఈయూ దేశాల నుంచి 15.69 శాతం, ఆసియాన్‌ నుంచి 10.65, అమెరికా నుంచి 5.69, ఎమిరేట్స్‌ నుంచి 5.5, సౌదీ అరేబియా నుంచి 5.1 శాతం, స్విట్జర్లాండ్‌ నుంచి 4.21 శాతం వస్తుసేవలను దిగుమతి చేసుకుంటున్నాం.

ప్రపంచ దేశాలు ఎవరి విపణులను వారు రక్షించుకునే యావలో దిగుమతులపై సుంకాలు పెంచేస్తే, వాణిజ్య యుద్ధం విరుచుకుపడటం ఖాయం. భారదేశ ప్రధాన వాణిజ్య భాగస్వాములు తమ వ్యాపారం కోసం అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి. ఆ దేశాల దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధిస్తే, మన భాగస్వాములకు మన ఎగుమతులూ దెబ్బతినిపోతాయి. అది భారత్‌కు ఎంతో నష్టదాయకం. ఉదాహరణకు చైనా ఎగుమతుల్లో 18 శాతం అమెరికాయే స్వీకరిస్తోంది. మన ఇతర భాగస్వాముల పరిస్థితీ ఇంతే. 12.7 శాతం బ్రెజిల్‌ ఎగుమతులు, అమెరికాకే చేరుతున్నాయి. ఇంకా 26.7 శాతం ఈయూ ఎగుమతులు, 20.2 శాతం జపాన్‌ ఎగుమతులు, 12.3 శాతం దక్షిణ కొరియా ఎగుమతులకు అమెరికాయే ఆధారం. అమెరికా మార్కెట్‌పై భారత్‌ ఈ దేశాలంతగా ఆధారపడటం లేదు. కానీ, అమెరికాకు ఈ దేశాల ఎగుమతులు పడిపోతే అవి మనదేశంతో మునుపటంత జోరుగా వ్యాపారం చేయలేవు. అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులకు అవసరమైన విడిభాగాలను ఈ దేశాలు భారత్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వాణిజ్య యుద్ధంతో ఈ సరఫరా గొలుసు విచ్ఛిన్నమవుతుంది. సంపన్న దేశాల స్వీయ వాణిజ్య రక్షణ విధానాలవల్ల అందరూ నష్టపోయినా, భారతదేశం ఇంకా ఎక్కువ నష్టపోతుంది. విదేశీ వాణిజ్యం కుదేలైతే మన వ్యాపారాలు బలహీనపడి ప్రజల ఆదాయ, వినియోగాలూ క్షీణిస్తాయి. ఉదాహరణకు మాంస ఎగుమతులను తీసుకోండి. ఆసియా దేశాలు ఆర్థికంగా బలహీనపడితే అవి మన నుంచి ఇదివరకటిలా మాంసాన్ని దిగుమతి చేసుకోలేవు. దాంతో మాంస వ్యాపారంపై ఆధారపడినవాళ్లంతా నష్టపోతారు.
వ్యూహరచన అవసరం 

భారతదేశం కోశ, ఆదాయ, కరెంటు ఖాతాలు మూడింటిలోనూ లోటును ఎదుర్కొంటోంది. ఇదే మన ముందున్న అతి పెద్ద సమస్య. 25 దేశాలతో మనం రూ.5.6 లక్షల కోట్ల వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నాం. ఈ దేశాలకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలంటే భారత్‌కు దండిగా విదేశ మారక ద్రవ్యం కావాలి. విదేశీ వాణిజ్యంతో పాటు విదేశాల నుంచి వచ్చే ప్రత్యక్ష పెట్టుబడులు, మన స్టాక్‌ మార్కెట్లలోకి ప్రవహించే నిధులు, ప్రవాసులు స్వదేశానికి పంపే సొమ్ము- ఇవన్నీ భారత్‌కు విదేశ మారక ద్రవ్యాన్ని సమకూర్చే వనరులు. 2013 నుంచి భారత్‌లోకి ఏటా 6,700 కోట్ల డాలర్ల విదేశ మారక ద్రవ్యం ప్రవహిస్తోందని ఈ ఏడాది మార్చి 23న రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో విదేశాంగ మంత్రి తెలిపారు. 2015-16 నుంచి ఈ ప్రవాహం తగ్గిందని, ఈ ఏడాది 6,100 కోట్ల డాలర్లు మాత్రమే రావచ్చునన్నారు. ప్రస్తుతానికి భారత్‌ వాణిజ్య లోటు అదుపులోనే ఉన్నా, వాణిజ్య యుద్ధం విరుచుకుపడితే నిధుల ప్రవాహం తగ్గి దిగుమతుల బిల్లును చెల్లించడం కొంత కష్టం కావచ్చు. దీంతో మన ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉందన్న భయం వ్యాపించి, భారత్‌ నుంచి పెట్టుబడులు పలాయనం చిత్తగించవచ్చు. ముఖ్యంగా భారతీయ స్టాక్‌ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులను విదేశీ సంస్థాగత మదుపరులు తక్షణం వాపసు తీసుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి అవాంతరాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ సంవత్సరం అమెరికాలో పంటలు విరగకాశాయి. అందువల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. చైనాతో సంబంధాలు చెడినట్లయితే ఆ దేశానికి అమెరికా వ్యావసాయిక ఎగుమతులు తగ్గిపోయి ట్రంప్‌నకు అనుకూలంగా ఓటు వేసిన గ్రామీణ ఓటర్లు ఆర్థికంగా దెబ్బతింటారు. దీన్ని నివారించడానికి భారతీయ విపణిని తెరవాలంటూ ట్రంప్‌ ఒత్తిడి చేయవచ్చు. దానివల్ల మన గ్రామాలకు తీవ్ర విఘాతం ఎదురవుతుంది. ప్రస్తుతం భారత్‌ ప్రధానంగా వంటనూనెలను దిగుమతి చేసుకొంటూ రైతు ప్రయోజనాలను రక్షించడం కోసం ఇతర వ్యావసాయిక ఉత్పత్తుల దిగుమతిని నివారిస్తోంది. లేకుంటే మన గ్రామీణ సమాజం విదేశీ దిగుమతులను తట్టుకోలేక అతలాకుతలమవుతుంది. కాబట్టి వాణిజ్య యుద్ధం తెచ్చిపెట్టే ప్రమాదాలను గుర్తెరిగి యుద్ధ నివారణకు ప్రపంచమంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. భారత్‌ ఈ విషయంలో అప్రమత్తంగా మెలగాలి.

మిగులు తరిగి దిగులు...
న సేవారంగ ఎగుమతుల్లో అత్యధిక భాగాన్ని అందుకొంటున్న అమెరికా వాణిజ్య యుద్ధానికి దిగితే భారత్‌ చాలా నష్టపోతుంది. కారణం- మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకొంటున్న దానికన్నా ఎగుమతి చేస్తున్నదే ఎక్కువ కాబట్టి. ఫలితంగా భారత్‌కు నేడు అమెరికాతో రూ.1.03 లక్షల కోట్ల మిగులు ఉంది. మన వాణిజ్య భాగస్వాముల్లో మరే దేశం వద్ద ఇంత మిగులు లేదు. చైనా తరవాత అమెరికాయే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. భారత్‌కున్న 20 అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో కేవలం ఎనిమిది దేశాలతోనే వాణిజ్య మిగులు ఉంది. అందులో 75 శాతం ఒక్క అమెరికా వద్దే ఉంది. మిగతా దేశాలతో మనకున్న మిగుళ్లన్నీ దీనిముందు దిగదుడుపే. మరోవైపు చైనాతో మనకు రూ.2.59 లక్షల కోట్ల వాణిజ్య లోటు ఉంది. అంటే, చైనాకు మన ఎగుమతులకన్నా ఆ దేశం నుంచి మన దిగుమతులే చాలా ఎక్కువన్న మాట.

Source : Eenadu

జిత్తులమారి చైనా ఎత్తులు చిత్తు! 

వియత్నాం, తైవాన్‌లతో భారత్‌ దౌత్యబంధం 


చైనా విషయంలో భారత్‌ దూకుడు పెంచింది. వివిధ అంశాలపై ఇబ్బంది పెడుతున్న చైనాకు అదే స్థాయిలో, దానికి అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పాలని నిర్ణయించింది. భారత్‌లో పర్యటించడానికి తైవాన్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని అనుమతించడం; వియత్నామ్‌కు బ్రహ్మోస్‌, ఆకాశ్‌ క్షిపణులు అమ్మేందుకు సిద్ధపడటం ఆ వ్యూహంలో భాగమే. దీనిపై చైనా తీవ్రస్థాయిలో స్పందించింది. భారత్‌ నిప్పుతో చెలగాటమాడుతోందని హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్ర వివాదం చైనా, వియత్నామ్‌ల మధ్య చిచ్చు రేపుతోంది. ఆ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. సైనిక శిక్షణ, గస్తీ వాహనాల విషయంలో భారతదేశం ఇప్పటికే వియత్నామ్‌కు సహాయపడుతోంది. తాజాగా ఆ దేశానికి క్షిపణులు అమ్మేందుకు భారత్‌ ముందుకు రావడంతో చైనా కుతకుతలాడుతోంది. మరోవైపు తైవాన్‌ ప్రతినిధి బృందాన్ని భారత్‌లో పర్యటనకు అనుమతించడం చిన్న విషయమేమీ కాదు. భారత ప్రభుత్వం ఇప్పటివరకు ‘ఒకే చైనా’ విధానాన్ని అనుసరిస్తోంది. ఇప్పుడు అందుకు భిన్నంగా వెళ్తొందన్న వాదన వినిపిస్తోంది. ‘ఒకే చైనా’ విధానానికి కట్టుబడి ఉండాలని, తైవాన్‌తో ఎలాంటి అధికారిక సంబంధాలు కొనసాగించరాదన్న చైనా హెచ్చరికపై భారత్‌ గట్టిగానే స్పందించింది. తైవాన్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని అనుమతించడం అసాధారణమైన చర్యేమీ కాదని తేల్చి చెప్పింది.

పాక్‌పై ప్రేమతోనే... 


మూడు కీలక అంశాలపై చైనా మొండిగా వ్యవహరిస్తుండటమే భారత్‌ విధానంలో మార్పునకు కారణంగా కనిపిస్తోంది. అణు సరఫరాదారుల బృందంలో భారత్‌ ప్రవేశాన్ని చైనా అడ్డుకుంటోంది. మసూద్‌ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించేలా ఐక్యరాజ్య సమితిలో భారత్‌ ప్రయత్నాలను నిష్ఫలం చేస్తోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీరు భూభాగం మీదుగా చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా(సీపీఈసీ) నిర్మాణంపై మనదేశ అభ్యంతరాలను చైనా లెక్కచేయడం లేదు. జైషే మొహమ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించడానికి అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ సహా భద్రతా మండలిలోని పద్నాలుగు దేశాలు సుముఖంగానే ఉన్నాయి. చైనా మాత్రం ‘వీటో’ అధికారంతో అడుగడుగునా అడ్డుతగులుతోంది. పాక్‌తో కుమ్మక్కు కావడం వల్లే చైనా అలా చేస్తోంది. అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వం విషయంలోనూ ఇలాగే జరిగింది. సియోల్‌ వేదికపై నిరుడు జూన్‌లో ఎన్‌ఎస్‌జీ ప్రత్యేక ప్లీనరీ జరిగినప్పుడు భారత్‌ దరఖాస్తు పరిశీలనకు వచ్చింది. ఎన్‌ఎస్‌జీలోని మొత్తం 48 సభ్య దేశాల్లో 47 దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. చైనా ఒక్కటే అవరోధంగా మారింది. అన్ని దేశాలూ సమ్మతించాల్సి ఉండటంతో ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వం నేటికీ అందని మానిపండుగానే మిగిలింది. భారత్‌ను చేర్చుకుంటే పాకిస్థాన్‌కు ప్రవేశం దక్కదేమోనని చైనా ఆందోళన చెందుతోంది. ఎన్‌ఎస్‌జీలో చేరితే, పాక్‌ ప్రవేశాన్ని అడ్డుకొనే అధికారం భారత్‌కు సంక్రమిస్తుంది. అది చైనాకు ఇష్టంలేదు. భారత్‌తో పాటు పాకిస్థాన్‌కూ ఎన్‌ఎస్‌జీలోకి ప్రవేశం కల్పించాలని చైనా కోరుతోంది. భారత్‌-చైనాల మధ్య కాకుండా, భారత్‌-పాకిస్థాన్‌ల మధ్యే పోలిక తెచ్చే పరిస్థితి రావాలని బీజింగ్‌ కోరుకుంటోంది.
పాక్‌ ప్రమాదకర అణ్వాయుధ దేశం. ఏనాటికైనా అణ్వాయుధాలు ఉగ్రవాద శక్తుల చేజిక్కే ముప్పు అక్కడ ఉంది. అందుకే ఎన్‌ఎస్‌జీ ద్వారా పాక్‌కు అణ్వాయుధ సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కావడానికి అమెరికా అనుమతించడంలేదు. ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం లభిస్తే భారత్‌ తన అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవచ్చునని, ఆ పరిస్థితి తనకు ప్రమాదకరమని చైనా భావిస్తోంది. పైగా భారత్‌కు ఒకసారి ఎన్‌ఎస్‌జీలో ప్రవేశం దక్కిందంటే, ప్రపంచ అణ్వాయుధ దేశంగా దానికి గుర్తింపు లభిస్తుంది. అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒడంబడిక (ఎన్‌పీటీ)లో చేరకపోయినా, ఎన్‌ఎస్‌జీ సభ్యత్వం పొందిన మొట్టమొదటి దేశంగా ఇండియా నిలుస్తుంది. మిగతా ప్రపంచంతో అణు వాణిజ్యం నిర్వహించడానికి భారత్‌కు అమెరికా మినహాయింపు ఇచ్చినందువల్ల అది సాధ్యమే. ఎన్‌పీటీలో చేరని ఇతర దేశాలైన పాకిస్థాన్‌, దక్షిణ సూడాన్‌, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌లకు మాత్రం అమెరికా ఇప్పటివరకు అలాంటి మినహాయింపు ఇవ్వలేదు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భూభాగం మీదుగా ఆర్థిక నడవా నిర్మాణంపై అభ్యంతరాలను చైనా ఎంతమాత్రం ఖాతరు చేయడం లేదు. పాక్‌, చైనాలు ఆ ప్రాంతంలో జోరుగా మౌలిక వసతులు అభివృద్ధి పరుస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పార్లమెంటుకు తెలిపింది. చైనా కార్యకలాపాల పట్ల ఆ శాఖ ఎన్నోమార్లు ఆందోళన వ్యక్తపరచింది. అలాంటి చర్యలను విడనాడాలని కోరింది. వాటిని చైనా ఖాతరు చేయడం లేదు. ప్రపంచీకరణ పథంలో మరింత ముందుకు దూసుకుపోవాలంటే ఆర్థిక నడవా అత్యవసరమని చైనా భావిస్తోంది. ఈ ఆర్థిక నడవా పశ్చిమ చైనా, పశ్చిమాసియా, ఆఫ్రికాల మధ్య సన్నిహిత అనుసంధానానికి దోహదపడుతుందని, అందువల్లే 4,600 కోట్ల డాలర్ల ఈ పథకాన్ని చైనా చేపట్టిందని ఫోర్బ్స్‌ ఒక నివేదికలో పేర్కొంది. భారత్‌కు చెందిన భూభాగం మీదుగా ఈ నడవాను నిర్మిస్తుండటమే అభ్యంతరకరం. ఈ విషయంలో భారత్‌ మాట వినే పరిస్థితిలో చైనా లేదు. ఈ పథకం అమలులో వేగంగా ముందుకెళ్తొంది. దక్షిణ చైనా సముద్ర వివాదం విషయంలో అమెరికావైపు భారత్‌ ఎందుకు నిలబడాల్సివచ్చిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. చైనా కన్నూమిన్నూ కానకుండా వ్యవహరిస్తున్నందువల్లే ఆ దేశానికి అర్థమయ్యే భాషలోనే జవాబు చెప్పాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.

దక్షిణ చైనా సముద్ర వివాదం విషయంలో అనేక దేశాలను చైనా ఇప్పటికే దూరం చేసుకుంది. ‘ఆసియాన్‌’లోని పది దేశాలతోనూ వైరం తెచ్చుకుంది. జపాన్‌తోనూ గొడవపడుతోంది. చైనాను అదుపు చేయడంలో భాగంగా ఆ దేశాలన్నింటికీ భారత్‌ ఇప్పుడు స్నేహహస్తం చాస్తోంది. ముఖ్యంగా, చైనా అంటేనే భగ్గుమంటున్న వియత్నామ్‌తో భారత్‌ మైత్రి చాలా కీలకమైంది. చైనాపై ఒత్తిడి పెంచి, నియంత్రించాలంటే వియత్నామ్‌ వంటి దేశాలతో బంధాన్ని దృఢపరచుకోవడమే మార్గమని భారత్‌ గుర్తించింది. అందుకే నౌకా, వైమానిక దళ సామర్థ్యాల్ని పెంపొందించుకునే విషయంలో వియత్నామ్‌కు అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తోంది. అందులో భాగంగానే ఆకాశ్‌, బ్రహ్మోస్‌ క్షిపణుల అమ్మకానికి సిద్ధపడింది. భారత్‌, వియత్నామ్‌ల మధ్య శతాబ్దాలుగా సాంస్కృతిక సంబంధాలు కొనసాగుతున్నాయి. 45 ఏళ్లుగా దౌత్య సంబంధాలు ఉన్నాయి. వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి. 2014లో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వియత్నామ్‌లో పర్యటించారు. ఆయుధ సామగ్రి కొనుగోలు కోసం వియత్నామ్‌కు 10 కోట్ల డాలర్ల దాకా సహాయం అందజేయడానికి ఆ సందర్భంగా భారత్‌ అంగీకరించింది. నిరుడు ప్రధాని నరేంద్ర మోదీ హనోయ్‌ (వియత్నాం రాజధాని) పర్యటనలో విడుదల చేసిన సంయుక్త ప్రకటనలోనూ భారత్‌, వియత్నాం సంబంధాల కీలక ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు.
సవాలుకు సరైన జవాబు 

తైవాన్‌తో భారత్‌ అధికారిక సంబంధాలు చైనాను చికాకు పరుస్తున్నాయి. తైవాన్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని భారత్‌లో పర్యటనకు అనుమతించడంతో చైనా ఇరకాటంలో పడింది. తైవాన్‌ తన భూభాగమేనని, ఏదో ఒకనాటికి తమదేశంలో విలీనమై తీరుతుందని చైనా అంటోంది. తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించకుండా, దాంతో సహా మొత్తం చైనాను ఒకే దేశంగా గుర్తించడమే- ‘ఒకే చైనా’ విధానమంటే! 1949లో చైనాలో అంతర్యుద్ధం ముగిసినప్పటినుంచీ కొనసాగుతున్న విధానమది. ఆ యుద్ధంలో ఓడిపోయిన జాతీయవాదులు (కొమింటాంగ్‌) తైవాన్‌కు పారిపోయి, అక్కడ ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. గెలిచిన కమ్యూనిస్టులు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా పేరిట ప్రధాన భూభాగాన్ని పాలించసాగారు. చైనాకు అసలైన ప్రతినిధులం తామేనని ఉభయపక్షాలూ చెప్పుకోవడం గమనార్హం. తైవాన్‌ కనుక అధికారికంగా స్వాతంత్య్రం ప్రకటించుకుంటే, బల ప్రయోగానికి పాల్పడాల్సివస్తుందని చైనా పాలక కమ్యూనిస్టుపార్టీ హెచ్చరిస్తోంది. కానీ, ఇటీవలి కాలంలో తైవాన్‌ పట్ల అది కొంత మెత్తగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మొదట్లో అమెరికా సహా చాలా దేశాలు తైవాన్‌ను గుర్తించాయి. 1970 తరవాత అవి తైవాన్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకుని, బీజింగ్‌కు దగ్గరయ్యాయి. తైవాన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలూ ఉన్నాయి. తైవాన్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించని దేశాలే ప్రపంచంలో అధికం. ఐక్యరాజ్య సమితి సైతం తైవాన్‌కు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. దౌత్య సంబంధాల విషయంలో దెబ్బతిన్న తైవాన్‌, ఇరుగు పొరుగు దేశాలతో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మాత్రం కొనసాగించగలుగుతోంది. ఈ పరిస్థితుల్లో తైవాన్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని భారత్‌లో పర్యటనకు అనుమతించడం సహజంగానే చైనాకు ఆగ్రహం కలిగించింది. భారత్‌ చొరవ వల్ల తైవాన్‌తో సంబంధాలు బలపడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆకర్షణీయ నగరాలు, భారత్‌లో తయారీ కార్యక్రమాల్లో తైవాన్‌ నైపుణ్యపరమైన సహాయ సహకారాలు అందజేసే అవకాశం ఉంది. తన కంట్లో నలుసుగా మారిన తైవాన్‌తో భారత్‌లాంటి పెద్ద దేశం సన్నిహిత అధికారిక సంబంధాలు ఏర్పరచుకోవడం చైనాను చిర్రెత్తిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడానికి తన పాకిస్థానీ ప్రేమే కారణమని బీజింగ్‌ నేటికీ గ్రహించకపోవడం విడ్డూరం. చైనా విసురుతున్న సవాళ్లకు ఏ రీతిన జవాబులు చెప్పాలో భారత్‌కు అర్థమైంది. ఇండియా ఇప్పుడు ఆ పనే చేస్తోంది!
- నీరజ్‌ కుమార్‌
Source : Eenadu (07-03-2017)

Editorial as Image format


Editorial as Pdf format

పాక్‌ కుట్రలపై జలఖడ్గం

ణువణువునా దురహంకారంతో వరస అణుపరీక్షలకు ఉరకలెత్తుతున్న ఉత్తర కొరియాను కఠిన ఆంక్షల కొరడా ఝళిపించి నియంత్రించి తీరాలన్న దానిపై దాదాపు ప్రపంచ దేశాలన్నింటిదీ ఒకటే మాట. పెనుముప్పుగా దాపురించిన భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)ను తుదముట్టించాల్సిందేనన్న అంశంపైనా అంతర్జాతీయ సమాజానిది ఒకటే బాట. అడ్డదారిన అణ్వస్త్రం సముపార్జించి, దొడ్డిదారిన ఆ పరిజ్ఞానాన్ని ఉత్తర కొరియా, ఇరాన్లకు బదలాయించి, కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలకు నారూ నీరూ పోసి పెంచుతున్న పాకిస్థాన్‌- అణు ఉగ్రవాద పెను విలయశక్తి అనడంలో మరోమాట లేదు. ఉగ్రవాదాన్నే ప్రభుత్వ విధానంగా తీర్చిదిద్దిన ఇస్లామాబాద్‌ను ఏకాకిని చెయ్యాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌ ఎలుగెత్తినా, అది ఎందరి చెవికెక్కిందన్నది ప్రశ్నార్థకమే. భారత్‌ సౌహార్దాన్ని బలహీనతగా ఎంచి ఉగ్రవాద వ్యాఘ్రాల దాడులతో నెత్తుటేళ్లు పారిస్తున్న పాకిస్థాన్‌కు గట్టిగా గుణపాఠం నేర్పాల్సిందేనన్న జాతి మనోగతమూ అర్థవంతమే. రెండు అణ్వస్త్ర రాజ్యాల మధ్య ప్రత్యక్ష యుద్ధం జరిగితే విజేతలు ఎవరూ ఉండరనే దూరదృష్టితో, 1960నాటి కీలక ‘జల సంధి’పై మోదీ ప్రభుత్వం చూపు సారించింది. సింధు జలాల ఒప్పందానుసారం జమ్మూకశ్మీర్‌ నుంచి ప్రవహించే సింధు, చీనాబ్‌, జీలం వంటి పశ్చిమ నదుల నియంత్రణాధికారం పాకిస్థాన్‌కు; పంజాబ్‌ ద్వారా సాగిపోయే రావి, బియాస్‌, సట్లెజ్‌ల బాధ్యత ఇండియాకూ దఖలు పడింది. జమ్మూకశ్మీర్‌లో ఆరు లక్షల హెక్టార్లకు అదనంగా సాగునీరు అందేలా సింధు, చీనాబ్‌, జీలం నదుల్లో మన వాటా నీటిని గరిష్ఠంగా వాడుకోవాలని, లోగడ ఏకపక్షంగా రద్దుచేసిన తుల్‌బుల్‌ ప్రాజెక్టును పునస్సమీక్షించాలనీ ప్రధాని మోదీ నిర్ణయించారు. ఉగ్రవాద రహిత వాతావరణం నెలకొన్నప్పుడే సంబంధిత జలసంఘంలో పాక్‌తో సంప్రతింపులు సాగుతాయనీ తేల్చేశారు. చీనాబ్‌ నదిపై మూడు ఆనకట్టల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచెయ్యాలంటూ, ‘నీరూ రక్తం కలిసి ప్రవహించలేవు’ అన్న ప్రధాని మోదీ వ్యాఖ్య- అక్షరాలా కుక్కకాటుకు చెప్పుదెబ్బ!
ప్రపంచ బ్యాంక్‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ద్వారా పాకిస్థాన్‌కు జవజీవాలు అందించేలా ప్రవహిస్తున్నవి సింధు జలాలు కావు- అవి భారత సౌహార్ద సుహృద్భావాలు! దిగువ దేశానికి 80 శాతం వాటా పెట్టిన సింధు జలాల వంటి అంతర్దేశీయ ఒప్పందం వేరెక్కడా లేదు. పాకిస్థాన్‌లో 65శాతం భూభాగం సింధు పరీవాహక ప్రాంతమే. 90శాతం సేద్య అవసరాలకు, సాగునీటికి, పరిశ్రమలకు అక్కరకొస్తున్నదీ సింధు జలాలే. తమ నదులపై పూర్తి అజమాయిషీ సాధించాలన్న దురాలోచనతోనే కశ్మీరును పాక్‌ కబళించాలనుకొంటోందన్న విశ్లేషణలు ఏమాత్రం తోసిపుచ్చలేనివి. ఒప్పందం రద్దు లాంటి కఠిన నిర్ణయాల జోలికి పోకుండా, పశ్చిమ నదుల్లో న్యాయబద్ధంగా మన వాటా నీటిని సేద్యం, నిల్వ, విద్యుదుత్పత్తి అవసరాలకు వాడుకోవాలన్న మోదీ ఆదేశమే పాకిస్థాన్‌లో ప్రకంపనలు పుట్టిస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని కిషన్‌గంగ, రాట్లే జలవిద్యుత్కేంద్రాలపై ఇండియాను అంతర్జాతీయ మధ్యవర్తిత్వానికి లాగుతామంటూ పాక్‌ రక్షణ నీటిపారుదల శాఖ మంత్రి మొన్న జూన్‌లో నోరు పారేసుకున్నారు. అటువంటిది ఇప్పుడు వెయ్యి మెగావాట్ల పాకల్‌దుల్‌, 1020 మెగావాట్ల బుర్సార్‌, 1200 మెగావాట్ల సవాల్‌కోట్‌ ప్రాజెక్టులపై మోదీ సర్కారు దృష్టి సారించేసరికి- ‘పాక్‌పై యుద్ధానికి భారత్‌ సిద్ధం’ అంటూ అక్కడి పత్రికల్లో పతాక శీర్షికలు! వీటికితోడు తుల్‌బుల్‌ నౌకాయాన ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే తమకు నీటి లభ్యత తగ్గిపోవడంతోపాటు, యుద్ధసమయంలో అది ఇండియాకు అత్యంత అనుకూలంగా మారుతుందని పాక్‌ పెద్దలు బెంబేలెత్తుతున్నారు. కాబట్టే, భారత్‌ వ్యవహారసరళిపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ గగ్గోలు పెడుతున్నారు. జమ్మూకశ్మీర్‌ సామాజికార్థిక ప్రగతికి దోహదపడే ప్రాజెక్టుల పట్ల పాక్‌ ఏలికల నిజనైజాన్ని కశ్మీరీ యువజనానికి తెలియజేసి, లోయలో భారత్‌ అనుకూల వాతావరణం పెంపుదలకు ఇదే అదను!
ఎల్లవేళలా యుద్ధం ఆయుధాలతోనే చెయ్యాల్సిన పని లేదు. దాదాపు ఏడు కోట్ల మంది పేదరికంతో అలమటిస్తున్న పాకిస్థాన్లో 42శాతం జనావళి జీవికకు వ్యవసాయమే దిక్కు. వ్యవసాయ రంగంలో వృద్ధి సున్నా స్థాయికంటే (మైనస్‌) దిగజారి, మూడొంతుల బడ్జెట్‌ రుణసేవలకే ఖర్చు చెయ్యాల్సిన దురవస్థలో ఉన్న పాకిస్థాన్‌- ఒప్పందానుసారం తన వాటా నీటిని భారత్‌ వాడుకొంటానంటేనే ఎందుకు ఇంతగా భయకంపితమవుతోందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో పర్యవసానాల్నీ మోదీ ప్రభుత్వం జాగ్రత్తగా మదింపు వెయ్యాలి. టిబెట్‌లో పుట్టి ప్రవహిస్తున్న సింధు నదిపై ఇండియా తాజా నిర్ణయాలకు చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి: భారత్‌ స్నేహ హస్తం సాచినప్పుడే కతువా, గురుదాస్‌పూర్‌, పఠాన్‌కోట్‌, ఉరీ దాడులకు తెగబడిన పాకిస్థాన్‌ మరింత ఉన్మాదంతో ఉగ్రవాద శక్తుల్ని ఉసిగొలిపే ప్రమాదం మరింతగా పొంచి ఉంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సర్వ సమగ్ర ఒడంబడిక (సీసీఐటీ) రూపొందాలని రెండు దశాబ్దాలుగా భారత్‌ చేస్తున్న ప్రయత్నం ఏమాత్రం ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో 28 ఏళ్లుగా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంతో నిరంతరం నెత్తురోడుతున్న ఇండియా- ఉగ్రవాద నిర్మూలన జాతీయ కేంద్రం (ఎన్‌సీటీసీ) ఏర్పాటులో మరేమాత్రం జాగు చెయ్యకూడదు. సరిహద్దుల్లోను, నిద్రాణశక్తుల్ని (స్లీపర్‌ సెల్స్‌) ఉసిగొల్పి దేశీయంగానూ నెత్తుటి నెగళ్లను ఎగదోసే పాక్‌ కుహకాన్ని మరింత అప్రమత్తంగా కాచుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కావాలిప్పుడు!

వ్యర్థాలపై సమర్థ వ్యూహం!
‘కాదేదీ పునశ్శుద్ధికి అనర్హం’ అనుకుంటూ ఎన్నో దేశాలు వ్యర్థాలనూ సమర్థ వనరులుగా మలచుకుంటుంటే, ఆ విషయంలో ఇండియా వెనకబాటు అనేక అనర్థాలకు దారితీస్తోంది. అధునాతన జీవనశైలి కారణంగా ఏటికేడు పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌ వ్యర్థాల (ఈ-వ్యర్థాల) పునశ్శుద్ధిని పెద్ద పరిశ్రమగా వృద్ధిచేసిన దక్షిణ కొరియా, యూకే, జపాన్‌, నెదర్లాండ్స్‌ లాంటివి అగ్రరాజ్యమైన అమెరికానే తలదన్ని దూసుకుపోతున్నాయి. అమెరికాలో ఈ-వ్యర్థాల పునశ్శుద్ధి 40శాతానికి చేరగా, ఆ నాలుగూ 50నుంచి 80శాతం దాకా సాధిస్తూ అబ్బురపరుస్తున్నాయి. నవీన జీవనశైలికి సంకేతాలైన పలు వస్తూత్పాదనలు కొన్నాళ్ల వినియోగానంతరం ఈ-వ్యర్థాలుగా మారి దేశ పర్యావరణానికి, ప్రజారోగ్యానికి గడ్డుసవాళ్లు విసరుతున్నాయి. పాతబడిన కంప్యూటర్లు, టీవీలు, చరవాణులు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు లాంటివి దేశంలో కుప్పలుతెప్పలుగా పోగుపడుతున్నాయి. ఇండియాలో ఏటా అలా ‘ఉత్పత్తవుతున్న’ వ్యర్థాల రాశి ఎకాయెకి 18.5లక్షల టన్నులు. దిగ్భ్రమపరచే ఈ గణాంకాలు, భారత్‌ పోనుపోను ఎంతటి సంక్షోభంలో కూరుకుపోతోందో చాటుతున్నాయి. ఏడాదికి 1.2లక్షల మెట్రిక్‌ టన్నుల ఈ-వ్యర్థాల ఉత్పత్తితో ముంబయి నగరం ‘ముందంజ వేస్తోంది’. దిల్లీ(98వేల టన్నులు), బెంగళూరు (92వేలు), చెన్నై (67వేలు) కోల్‌కతా (55వేలు), అహ్మదాబాద్‌ (36వేలు), హైదరాబాద్‌ (32వేలు) నగరాల్లోనూ భారీగా ఈ-వ్యర్థాలు పేరుకుపోతున్నాయని అసోచామ్‌, కేపీఎమ్‌జీ సంస్థల సంయుక్త అధ్యయనం తాజాగా వెల్లడించింది. దేశంలో అలా ఉత్పత్తవుతున్న ఈ-వ్యర్థాల్లో కేవలం 2.5శాతమే రీసైక్లింగుకు నోచుకుంటున్నాయన్నది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. లక్షల టన్నుల మేర పేరుకుపోతున్న ఈ-వ్యర్థాలు నేలను, నీటిని, గాలిని విషకలుషితం చేసేస్తున్నాయి. వాటివల్ల మెదడు, నాడీ వ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతింటాయని, పుట్టబోయే పిల్లల్లో అంగవైకల్యమూ ఏర్పడుతుందంటున్న హెచ్చరికల నేపథ్యంలో- దిద్దుబాటు వ్యూహాలు చురుగ్గా పదును తేలాల్సి ఉంది!
అత్యధికంగా ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీల తరవాతి స్థానం ఇండియాదేనని ఐక్యరాజ్య సమితి అధ్యయనం ఏడాది క్రితం ధ్రువీకరించింది. మూడేళ్ల వ్యవధిలో విశ్వవ్యాప్తంగా ఈ-వ్యర్థాల పరిమాణం 21శాతం దాకా విస్తరించనుందనీ ఆ నివేదిక హెచ్చరించింది. ఏదైనా కొత్త వస్తూత్పాదన విపణిలో పాదం మోపిందే తడవుగా దాన్ని సొంతం చేసుకోవాలన్న మోజు, వేలంవెర్రి పోటీ ఇంతలంతలైన వాతావరణం దృష్ట్యా- దేశీయంగా మరింత ప్రమాదం నెత్తిన ఉరుముతోంది. ఇప్పటికే వందకోట్లకు పైబడి చరవాణులు ఉపయోగిస్తున్న భారత్‌లో, ఏటా దాదాపు నాలుగోవంతు ఈ-వ్యర్థాల బాట పడుతున్నాయి. ఇంకో మూడేళ్లలోనే భారతగడ్డ మీద సంవత్సరానికి 30లక్షల టన్నుల దాకా వ్యర్థాల ఉత్పత్తి నమోదు కానుందని ‘అసోచామ్‌’ (వాణిజ్య పారిశ్రామిక సంఘాల సమాఖ్య) భవిష్యద్దర్శనం చేస్తోంది. ప్రస్తుతం ఎడాపెడా వచ్చిపడుతున్న ఈ-వ్యర్థాల్లో సింహభాగం ప్రధానంగా అసంఘటిత రంగానికే చేరుతోంది. వాటిని పునశ్శుద్ధి చేసే నైపుణ్యం, అందుకు అవసరమైన శిక్షణ కొరవడి బడుగు కార్మికులు, పేద పిల్లలు హానికర రసాయనాలూ అవశేషాల కారణంగా మహమ్మారి వ్యాధుల పాలబడుతున్నారు. అటు పర్యావరణానికి తూట్లు పొడుస్తూ, ఇటు అసంఖ్యాక అభాగ్యుల బతుకుల్ని కర్కశంగా కాటేస్తున్న ఈ-వ్యర్థాల నియంత్రణపై ప్రజల భాగస్వామ్యానికి ప్రోదిచేసే పటుతర కార్యాచరణ తక్షణావసరం. ఈ కీలకాంశానికి సమధిక ప్రాముఖ్యం చేకూరితేనే, ‘స్వచ్ఛభారత్‌’ స్ఫూర్తి సంపూర్ణ ఫలితాలను ఒడిసిపట్టగలదన్నది యథార్థం.
హానికరమైన వ్యర్థ పదార్థాల దిగుమతిని నిషేధిస్తూ బాసెల్‌ ఒడంబడికపై సంతకం చేసిన దేశాల్లో భారత్‌ ఒకటి. స్వదేశంలో పద్ధతి ప్రకారం పునశ్శుద్ధి కార్యక్రమాలు చేపట్టేకన్నా గప్‌చుప్‌గా ఆసియాకో ఆఫ్రికాకో తరలించేస్తే ఎంతో మిగులు అన్న సంపన్న రాజ్యాల దుస్తంత్రం పుణ్యమా అని, ఆ ఒప్పందం నిలువునా నీరుగారుతోంది. ఆఫ్రికాలో ఘనా, నైజీరియాలకు; ఆసియాలో చైనా, మలేసియా, పాకిస్థాన్లతోపాటు భారత్‌కు ఈ-వ్యర్థాల అక్రమ రవాణా ఏటికేడు పోటెత్తుతోంది. ఈ-వ్యర్థాల సమర్థ నిర్వహణ కోసమంటూ 2011లో క్రోడీకరించిన నిబంధనల అమలు బాధ్యతను యూపీఏ జమానా గాలికొదిలేసింది. పది వారాల క్రితం నూతన నిబంధనావళిని గెజెట్‌లో ప్రకటించిన మోదీ ప్రభుత్వం- వస్తూత్పాదకులు, డీలర్లు, రాష్ట్రప్రభుత్వాల ఇదమిత్థ బాధ్యతల్ని రెండో ప్రకరణంలో పేర్కొంది. వాటిపై విస్తృత జనచేతన పెంపొందించడంతోపాటు ఈ-వ్యర్థాల సేకరణ, నిర్వహణలకు రాష్ట్రాలవారీగా కాలుష్య నియంత్రణ మండళ్లను ఆయత్తపరచడం ప్రజాప్రభుత్వాల విహిత బాధ్యత! నిర్ణీత గడువు ముగియడంతోనే విక్రయదారులే ఈ-వ్యర్థాలను వెనక్కి తీసుకునే పద్ధతి నార్వేలో దశాబ్దం కాలంగా అమలవుతోంది. పాత టీవీలు తదితరాల్ని పౌరులు, స్వచ్ఛంద సంస్థలు పునర్వినియోగ కేంద్రాలకు తరలించే సంస్కృతి స్వీడన్‌లో వేళ్లూనుకుంది. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్ర దేశంగా అవతరించిన స్వీడన్‌ అనుభవాలు, దేశీయ వ్యూహాలకు ఒరవడి దిద్దాలి. వెలుపలి నుంచి అక్రమ తరలింపులు వెల్లువెత్తకుండా కాచుకుంటూ, క్రమేణా పునశ్శుద్ధి కేంద్రాలను విస్తరించే ద్విముఖ ప్రణాళికను సజావుగా పట్టాలకు ఎక్కించడమే- వ్యర్థాల సమస్యకు సరైన విరుగుడు అవుతుంది!


పొరుగు దేశాలతో రాదారి బంధం 
ఈశాన్య భారతానికి వరం 
భారత్‌-మియన్మార్‌-థాయ్‌లాండ్‌ రహదారి ద్వారా ఆగ్నేయాసియాతో పాటు మనదేశంలోని వెనకబడిన ఈశాన్య ప్రాంత ముఖచిత్రం మారిపోనుంది. ఈ రహదారి ఫలితంగా మౌలిక వసతులు పెరిగి చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు అవకాశం కలగనుంది. మూడు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఈ రహదారి మణిపూర్‌లోని మోరె నుంచి మియన్మార్‌లోని టము, మాండలే నగరం మీదుగా థాయ్‌లాండ్‌లోని మాయోసోట్‌ జిల్లా టాక్‌ వరకు విస్తరించేలా ప్రణాళిక రచించారు. దీనిపై వాహనాల ప్రయాణానికి అవసరమైన త్రైపాక్షిక మోటారు వాహనాల ఒప్పందం కోసం మూడు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. భారత్‌ నుంచి ఈ మార్గం మీదుగా ఫార్మా, యంత్రాలు, యంత్రపరికరాలు, ప్లాస్టిక్‌, వాహనాలు, పత్తి ఎగుమతి చేస్తారు. రహదారి మొత్తం పొడవు 1,400 కిలోమీటర్లు. మొదటి దశలో 78 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తారు. మియన్మార్‌లోని 73వంతెనలను భారత్‌ నిధులతో ఆధునీకరిస్తున్నారు. మరో 400 కిలోమీటర్ల రహదారిని ఆధునీకరిస్తారు. భారత్‌కు చెందిన సరిహద్దు రహదారి సంస్థ మియన్మార్‌లోని టము-కలెవ్వా-కలెమై రహదారిని ఇప్పటికే అభివృద్ధి చేసింది. మొదటిదశలో 192, రెండోదశలో వంద కిలోమీటర్ల రహదారిని థాయ్‌లాండ్‌ అభివృద్ధి చేయనుంది. ఏడాదిన్నర వ్యవధిలో రహదారి పనులు పూర్తి కాగలవని భావిస్తున్నారు. మణిపూర్‌లోని చందేల్‌ జిల్లాలో గల మోరె పట్టణం మియన్మార్‌ సరిహద్దుకు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్ర వాణిజ్య రాజధానిగా మోరెకు పేరుంది.
వాణిజ్యానికి కొత్త వూపు 

తొంభయ్యో దశకంలో పీవీ నరసింహారావు హయాములో ప్రారంభమైన ‘లుక్‌ ఈస్ట్‌’ విధానాన్ని తరవాత వచ్చిన ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లాయి. ఇందులో భాగంగా ఆగ్నేయాసియా దేశాలతో ద్వైపాక్షిక, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగాయి. ప్రస్తుత మోదీ ప్రభుత్వం ‘లుక్‌ ఈస్ట్‌’ విధానాన్ని ‘యాక్ట్‌ ఈస్ట్‌’గా మార్చి అభివృద్ధికి దారులు పరుస్తోంది. అధికారం చేపట్టగానే 2014 నవంబరులో మోదీ మియన్మార్‌ సందర్శించారు. భారత్‌-మియన్మార్‌-థాయ్‌లాండ్‌ రహదారి వెనక భారత్‌ చొరవ ఉంది. భారత ఈశాన్య ప్రాంతం ఆగ్నేయాసియాకు ముఖద్వారం వంటిది. బంగ్లాదేశ్‌, చైనా, భూటాన్‌, మియన్మార్‌ సరిహద్దులు గల ఈశాన్య ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకమైంది. ఇక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఒకింత భిన్నంగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలు విస్తృత సహజ వనరులకు నిలయాలు. అపారమైన జల వనరులు ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటే జలవిద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. పారిశ్రామిక అవసరాలకు విద్యుత్‌ ఉపయోగపడుతుంది. అవసరాలకు పోగా మిగిలినది పొరుగు దేశాలకు విక్రయించుకునే అవకాశం ఉంది. దేశం మొత్తం వెదురులో 28శాతం ఈ ప్రాంతం నుంచే లభిస్తుంది. ఇందులో మిజోరాం ముందుంది. వెదురు ఉత్పత్తిలో భారత్‌ ఆసియాలో రెండోస్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఏటా 46వేల టన్నుల రబ్బరు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా రబ్బరు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్‌ అయిదో స్థానంలో ఉంది. రబ్బరు సాగును ప్రోత్సహించడం ద్వారా 2017నాటికి సాగు విస్తీర్ణాన్ని రెట్టింపు చేయాలని భారత రబ్బరు సంస్థ ప్రతిపాదించింది. తేయాకు సాగుకూ ఈ ప్రాంతం ప్రసిద్ధి. అసోమ్‌లో తేయాకు అత్యధికంగా సాగు చేస్తారు. దేశంలో 50శాతానికి పైగా ఉత్పత్తి ఇక్కడి నుంచే లభిస్తోంది. మానవ వనరులకు కొరత లేదు. ఈ నేపథ్యంలో తేయాకు, రబ్బరు, వెదురు ఆధారిత చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు స్థాపనకు విస్తృత అవకాశాలు ఉన్నాయి.

మియన్మార్‌ చూడటానికి చిన్న దేశమే కావచ్చు. కానీ, అపారమైన సహజ వనరులకు అది నిలయం. విస్తృత తీరప్రాంతంతో పాటు సారవంతమైన నేలలకు కొదవ లేదు. ఈ ఆగ్నేయాసియా దేశంతో మొదటినుంచీ మనకు సత్సంబంధాలు ఉన్నాయి. అంగ్‌సాన్‌ సూచీ ప్రజాస్వామ్య ఉద్యమానికి అండగా నిలిచింది. అదే సమయంలో సైనిక పాలకులతో కూడా సత్సంబంధాలు నెరపింది. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్‌, మిజోరాం, నాగాలాండ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లతో సుమారు 1,643 కిలోమీటర్ల సరిహద్దులను పంచుకుంటోంది. బంగాళాఖాతం తీరప్రాంతం కలిగి ఉంది. ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు మియన్మార్‌ వాసులతో సత్సంబంధాలు ఉన్నాయి. భారత్‌, ఆగ్నేయాసియా దేశాల మధ్య మియన్మార్‌ వారధి లాంటింది. మణిపూర్‌లోని మోరె, ఇంఫాల్‌ నుంచి మియన్మార్‌లోని రెండో అతి పెద్ద నగరమైన మాండలేల మధ్య బస్సు సర్వీసు ప్రారంభించాలన్న ఆలోచన నేటికీ కార్యరూపం దాల్చలేదు. గతంలో మణిపూర్‌, నాగాలాండ్‌లకు చెందిన కొన్ని తిరుగుబాటు బృందాలు మియన్మార్‌లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు కొనసాగించాయి. ఆ దేశంతో సత్సంబంధాల ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదానికి కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు. థాయ్‌లాండ్‌ తరవాత మన దేశమే మియన్మార్‌కు అతిపెద్ద మార్కెట్‌. ఆ దేశ ఎగుమతుల్లో పాతిక శాతం భారత్‌కే వస్తున్నాయి. వ్యవసాయం, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, చమురు, సహజవాయువు, ఆహారశుద్ధి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయి. పెద్దసంఖ్యలో మియన్మార్‌ వాసులు అనధికారికంగా ఈశాన్య రాష్ట్రాల్లో నివసిస్తూ ఉపాధి పొందుతున్నారు. నిన్న మొన్నటి దాకా సైనిక పాలనతో విసిగిపోయినవారికి స్వదేశంకన్నా భారత్‌లోనే తమకు మంచి భవిష్యత్తు ఉందని వారు భావిస్తున్నారు. మియన్మార్‌కు భారత్‌ నాలుగో అతిపెద్ద వ్యాపార భాగస్వామి. థాయ్‌లాండ్‌, సింగపూర్‌, చైనా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
బహుళ ప్రయోజనాలు 

దశాబ్దాల సైనిక పాలన నుంచి ఇటీవలే ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని ప్రారంభించిన మియన్మార్‌లో వాణిజ్యావకాశాలు, పునర్నిర్మాణ పనులపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించింది. మొదటి నుంచీ మియన్మార్‌పై కన్నేసిన చైనా ఈ విషయంలో భారత్‌కన్నా ముందే ఉంది. భారత్‌ కాస్త ఆలస్యంగా మేలుకుంది. మే మూడోవారంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మియన్మార్‌లో పర్యటించారు. భారత్‌కు చెందిన యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు చురుగ్గా ప్రయత్నాలు సాగిస్తోంది. దశాబ్దాల పాటు మియన్మార్‌ సైనిక పాలనలో ఉన్నందువల్ల ఆ దేశంతో మన వాణిజ్యం తక్కువే. దానికితోడు సైనిక పాలకులపై చైనా ప్రభావం కారణంగా చెప్పుకోదగ్గ వాణిజ్యం జరగలేదు. 2020నాటికి వెయ్యి కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాప్రభుత్వం ఏర్పడటం, పునర్నిర్మాణ పనులపై అక్కడి ప్రభుత్వం దృష్టిపెట్టడం వల్ల మున్ముందు వాణిజ్య సంబంధాలు మెరుగ్గా ఉంటాయని అంచనా. తాజా రహదారి వల్ల నేరుగా రాకపోకలు సాగించేందుకు; ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. థాయ్‌లాండ్‌తోనూ మనకు సత్సంబంధాలే ఉన్నాయి. 2014లో ఇరుదేశాల మధ్య 800కోట్ల డాలర్ల మేర వాణిజ్యం జరిగింది. 2015లో ఇది 1,200కోట్ల డాలర్లకు పెరిగింది. పర్యాటక కేంద్రంగా పేరుగాంచిన థాయ్‌లాండ్‌ను నిరుడు పది లక్షల మందికి పైగా భారతీయ పర్యాటకులు సందర్శించారని అంచనా. తాజా రహదారి వల్ల వాణిజ్యంతోపాటు పర్యాటకుల సంఖ్యా పెరిగే అవకాశం ఉంది. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యావకాశాలు, ఈశాన్య రాష్ట్రాల ప్రగతికి దోహదపడే భారత్‌-మియన్మార్‌-థాయ్‌లాండ్‌ రహదారి ఎంత త్వరగా కార్యరూపం దాలిస్తే అంత మంచిది!

- గోపరాజు మల్లపరాజు

అంతర్జాలమే తరగతి గది! 
ఉన్నత విద్యలో తొలగుతున్న దూరాభారాలు 
న్నత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు తెరలేవనుంది. అహ్మదాబాద్‌లో ఇటీవల ఓ కీలక సమావేశంలో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) ఉపాధ్యక్షులు చేసిన ప్రకటన ఆ మేరకు నిర్దిష్ట సంకేతాలు అందించింది. దేశంలోని 850కిపైగా ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ కొత్త మార్పులు అందిపుచ్చుకొనేందుకు సమాయత్తం కావాలన్న ‘యూజీసీ’ పిలుపు ఒకరకంగా ‘వర్సిటీల’ మొద్దునిద్ర వదిలించేదే! ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా అభ్యసించడానికి వీలుగా ‘ఆన్‌లైన్‌ కోర్సు’లు రూపొందించాలన్న అంశంపై ఆ సమావేశం ఎక్కువగా దృష్టి సారించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ‘మూక్స్‌’ తరహాలో యువత కోసం ‘స్వయం’ పోర్టల్‌ను మానవ వనరులశాఖ ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికే కొన్ని కోర్సులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
దారిచూపిన పశ్చిమ దేశాలు
అంతర్జాల విద్యకు సంబంధించి విదేశాలు భారత్‌తో పోలిస్తే ఎంతో ముందున్నాయి. స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధిపరచిన ‘కోర్స్‌ఎరా’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడినుంచైనా అనేక రకాల కోర్సులు చదువుకోగల అద్భుత అవకాశం ఆవిష్కృతమైంది. సుమారు 20కిపైగా ఉన్న ఇలాంటి అంతర్జాలయ విద్యాసంస్థల్లో అధికంగా నమోదు చేసుకుంటున్నవారిలో అమెరికన్లది తొలిస్థానం. రెండో స్థానంలో భారతీయులు ఉండటం గమనార్హం. శాస్త్ర సాంకేతిక కోర్సులతోపాటు సామాజిక, మానవీయ శాస్త్రాల్లోనూ ఈ సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. ఒకేచోట తరగతి గదులు, బోధన కార్యకలాపాల నిర్వహణ అనే పద్ధతిని ఎమ్‌ఐటీ, హార్వర్డ్‌ వంటి సంస్థలు సమూలంగా మార్చివేశాయి. ఈ విద్యాసంస్థలు అందించే కోర్సులను తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యధిక సంఖ్యలో అందిపుచ్చుకొంటున్నారు.

సరికొత్త పోకడ 

భారత ప్రభుత్వం నూతన విద్యావిధానం ఆవిష్కరించడానికి ముందే రెండు ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఒకటి ఐచ్ఛికంగా ఎంచుకొనే ‘క్రెడిట్ల’ పద్ధతి. రెండోది- అంతర్జాలం ద్వారా విద్యార్జన మార్గాలకు ద్వారాలు తెరచుకోవడం. విద్యార్థులు తాము ఎంచుకొనే ‘క్రెడిట్ల’ పద్ధతిలో ప్రధాన పాఠ్య విభాగాలతోపాటు, వారికి ఆసక్తి ఉన్న లేదా అవసరమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి ఉపకరించే అంశాలను మొత్తం కోర్సులో 20శాతం మేర ఎంపిక చేసుకునే అవకాశం అతి త్వరలో రాబోతోంది. ఇక ఉన్నత విద్యలో అంతర్జాల కోర్సులకు ఆదరణ క్రమేపీ పెరుగుతోంది. ఓ అంచనా ప్రకారం ఆరున్నర లక్షల మంది భారతీయులు ఇప్పటికే ఎడక్స్‌, కోర్స్‌ఎరా వంటి అంతర్జాల కోర్సులు అందించే సంస్థల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విద్యను అభ్యసించడంలో యువతలో మారుతున్న అభిరుచికి ఇది సంకేతం. పేర్లు నమోదు చేసుకున్నవారిలో నేరుగా తరగతి గదులకు హాజరవుతున్న విద్యార్థులూ లక్షల సంఖ్యలో ఉండటం కొత్త కోణం. ఒకరకంగా ఇది మంచి పరిణామం. నేటి యువతకు సమాచార సాంకేతిక రంగాలకు సంబంధించిన వివిధ అప్లికేషన్లలో ప్రావీణ్యం తప్పనిసరి అవసరం అయింది. వారి అభ్యసన, ఉద్యోగ, దైనందిన అవసరాల్లో ఈ అప్లికేషన్ల వినియోగం అనివార్యంగా మారుతోంది. యువతకు కొత్త అవకాశాలు కల్పించే దిశగా విధానకర్తలను, విద్యావేత్తలను ప్రేరేపిస్తున్న పరిణామమిది. రాన్రాను అంతర్జాల బోధన, అభ్యసనలకు ఉన్నత విద్యావ్యవస్థలో చోటు పెరుగుతోంది. అభ్యసిస్తున్న డిగ్రీల్లో ఇరవై శాతానికి సమానమైన అంతర్జాల కోర్సులను గుర్తింపు పొందిన ఇతర విశ్వవిద్యాసంస్థల నుంచి పొందవచ్చునని యూజీసీ విధాన నిర్ణయం తీసుకొంది. ఆ మేరకు ప్రకటన వెలువడటమే తరువాయి. విద్యావ్యవస్థను సాంకేతిక పథం తొక్కిస్తున్న ఈ పరిణామాలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాయి. హైస్కూలు నుంచి విశ్వవిద్యాలయాల వరకు అనేక కోర్సులను ముఖాముఖి పద్ధతిలో విన్న అనుభూతి కలిగించే విధంగా అంతర్జాలం ద్వారా రకరకాల కోర్సులు అందించేందుకు యూజీసీ కృతనిశ్చయంతో ఉన్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్‌పీటీఈఎల్‌ (సాంకేతిక విజ్ఞానంతో అభ్యసనను కొనసాగించే జాతీయ కార్యక్రమం) 23 పాఠ్యాంశాల్లో సుమారు తొంభైకిపైగా కోర్సులు అందిస్తోంది. యూజీసీ ప్రయోగానికి వూపునిచ్చే పరిణామమిది.
సాంకేతిక విజ్ఞాన సాయంతో అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం గట్టి సవాలే. అయితే, విద్యారంగం ఏనాటి నుంచో ఎదుర్కొంటున్న మరో నాలుగు సవాళ్లనూ ఈ సందర్భంగా చర్చించుకోవాల్సి ఉంది. అవి: అందరికీ అందుబాటులో విద్య, చదువుల్లో నాణ్యత, సమకాలీన అవసరాలకు తగిన విద్య, సమృద్ధిగా నిధులు. ఈ నాలుగూ దేశంలో విద్యారంగం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు. ఇటీవలి అధ్యయనాల్లో దేశంలో కేవలం 23శాతం విద్యార్థులు మాత్రమే వయసుకు తగిన విద్య అభ్యసిస్తున్నారని తెలియజేస్తున్నాయి. మరోవంక నాణ్యమైన విద్యకు సంబంధించి జవాబులు వెదకాల్సిన ఎన్నో ప్రశ్నలు మనముందున్నాయి. ప్రస్తుత అవసరాలకు తగిన విద్య అందించడంలోనూ వెనకబాటు కనిపిస్తోంది. ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో సుమారు ఎనభైశాతం నిరుద్యోగులుగానే మిగిలిపోతుండటం శోచనీయం. ప్రమాణాలు పెంచేందుకు తగినన్ని ఆర్థిక వనరులు లభించకపోవడం బాధ కలిగించే విషయం. ఆర్థిక వనరుల సమస్య ఈనాటిది కాదు. అది 1968నుంచీ ఉన్న పరిస్థితే. నిధుల కేటాయింపులో 1998నుంచి కొంత పెరుగుదల ఉన్నప్పటికీ కాలంతోపాటు పెరుగుతున్న సవాళ్ల స్థాయికి తగినట్లుగా మాత్రం అవి లేవు.
ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చిన విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నాసిరకం విద్య అందించడంలో పోటీపడుతున్నాయి. అడుగంటుతున్న విద్యా ప్రమాణాలు ప్రభుత్వాన్నే నిర్ఘాంతపరుస్తున్నాయి. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో ప్రారంభించిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ ఆచరణలో ఎంతగా విఫలమవుతుందో కళ్లకు కనిపిస్తూనే ఉంది. వ్యవస్థలోని లోపాలను ఎక్కడికక్కడ అలాగే ఉంచి, కళాశాలల్లో తనిఖీలకు ప్రభుత్వ యంత్రాంగం పరిమితమవుతుండటం పతనమవుతున్న ప్రమాణాలకే నిదర్శనం. విద్యార్థులు విషయాలను అవగతం చేసుకుని, నేర్చుకొనే పద్ధతుల్లోనూ ఎన్నో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు భారతీయ సమాజంలో వెన్వెంటనే అంతర్భాగంగా మారిపోతున్నాయి. సమస్యను సరైన కోణంలో అర్థంచేసుకొని పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత- విద్యావేత్తలది, విధానకర్తలది! బోధన, అభ్యసనల్లో నాణ్యత అన్నవి పరస్పరం ప్రభావితమయ్యే అంశాలు. బోధన రంగంలో ఆశించిన మార్పులు తీసుకురావడం అనుకున్నంత తేలిక కాదు. బోధనలో నాణ్యత పెంచడానికి ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఓపెన్‌, దూరవిద్య విధానాలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పాలి. సమాచార సాంకేతిక ఆధారిత బోధన పద్ధతులూ విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్‌ సాంకేతిక పరిజ్ఞాన ఆగమనంతో విద్యార్జనలో నూతన శకం మొదలైంది. భారత ప్రభుత్వం ఇటీవల ‘ఈ-పాఠశాల’కు అంకురారోపణ చేయడం ద్వారా బహుముఖ కోణాల్లో జ్ఞానాన్ని సముపార్జించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించింది. దేశవ్యాప్తంగా ఏకకాలంలో తరగతుల నిర్వహణకు తగిన సాధన సంపత్తి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
కాలానుగుణ మార్పులు 

పదేళ్ల క్రితమే భారత్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎమ్‌లు ఈ తరహా కోర్సులను అంతర్జాలం ద్వారా అందించడం ప్రారంభించాయి. విద్యాబోధనలో చాపకింద నీరులా విస్తరిస్తున్న మార్పులను, ఆయా రంగాల్లో వస్తున్న నూతన ధోరణులను గమనించి కాలానుగుణంగా కోర్సులను అభివృద్ధి చేయడం తప్పనిసరి. సాంకేతిక విజ్ఞాన సాయంతో పాఠ్యాంశాలను అభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలూ మెండుగా ఉంటున్నాయి. కాలంతోపాటు వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు ఈ కోర్సుల్లో భాగం చేయాలి. ఆ రకంగా నేటితరానికి అంతర్జాల విద్యాకోర్సులు తిరుగులేని వరాలుగా మారబోతున్నాయి. ఆయా రంగాల్లో ఆధునిక మార్పులను గుర్తించి ఎప్పటికప్పుడు కోర్సులను నవీకరించడం ఎంతో అవసరం. అంతర్జాల విద్యావిధానం ప్రపంచాన్ని పలకరించి ఇప్పటికే దశాబ్దం దాటిపోయింది. అన్ని వయసులవారూ ఈ పద్ధతి ద్వారా విద్య అభ్యసించేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల బోధకులకూ ఎంతో వెసులుబాటు లభిస్తోంది. తాజా మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, తమను తాము నవీకరించుకునేందుకు ఈ ఆధునిక విద్యావిధానం వారికి అవకాశం ఇస్తోంది. విద్యార్థుల అభ్యసనం తీరుతెన్నులను నిర్దిష్టంగా మదింపు చేసి, వారిని మరింత సానపట్టేందుకు ఈ విధానం ఉపకరిస్తుంది. పాఠ్యాంశానికి సంబంధించిన సమాచారం, చిత్రాలు, వీడియోలు, పట్టికలు వంటి వనరులన్నీ ఒకేచోట లభించడంవల్ల, ఆయా అంశాలను నేర్చుకోవడం- ఆసక్తికరం, విజ్ఞానదాయకం! యూజీసీ సూచించబోయే నూతన విధానంలో విద్యార్థులు 60శాతం నుంచి 70శాతం వరకు పాఠ్యాంశాలకు సంబంధించిన మౌలిక విషయాలను సంప్రదాయ పద్ధతిలోనే నేర్చుకుంటారు. మిగిలిన 30శాతం పాఠ్యాంశాలను మారుతున్న అవసరాలకు తగిన నైపుణ్యాలను అలవరచుకునేందుకు ఉపకరించే కోర్సులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ తరహా నైపుణ్యాలను వివిధ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎమ్‌లు వంటి విఖ్యాత సంస్థలు అందించే అంతర్జాల కోర్సులను ఎంపిక చేసుకోవడం ద్వారా పెద్దగా శ్రమ, ఖర్చు లేకుండానే నేర్చుకోవచ్చు. ఆ మేరకు సునాయాసంగా డిగ్రీలూ పూర్తిచేయవచ్చు. ఈ తరహా సమ్మిళిత కోర్సుల అభ్యసనంవల్ల పట్టాల విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఈ తరహా మార్పులను సమర్థంగా అమలు చేయాలంటే ఉన్నత విద్యాసంస్థలు, వివిధ విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం చాలా అవసరం. జ్ఞానాన్ని మించిన సంపద లేదు. అజ్ఞానంకంటే పేదరికంలేదు. గతిశీల ప్రపంచం నిరంతరం మనకందిస్తున్న విలువైన సూత్రమిది. దీన్ని ఆచరణలోకి మార్చుకోవడమే ప్రస్తుతం మన ముందున్న కర్తవ్యం.
- ఆచార్య ఇవటూరి రామబ్రహ్మం


న్యాయానికి ఒక్కడు! 
ఆత్యయిక స్థితిపై తీర్పునకు 40ఏళ్లు 
ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో భారత న్యాయ వ్యవస్థ సమున్నత సంప్రదాయాలు నెలకొల్పుతోంది. సామాజిక సంక్లిష్టతలను అర్థం చేసుకొని, పౌరుల స్వేచ్ఛకు పెద్దపీట వేస్తూ తీర్పులు ఇవ్వడంలో కాలం గడుస్తున్నకొద్దీ భారత న్యాయవ్యవస్థలు పరిణతి చెందుతున్నాయి. అత్యవసర పరిస్థితి కాలంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఓ తీర్పు మాత్రం అందరినీ నివ్వెరపాటుకు గురిచేసింది. సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం, ఏప్రిల్‌ 28న ‘సుప్రీం’ ఇచ్చిన తీర్పు చరిత్రలో ఓ మాయనిమచ్చలా మిగిలిపోయింది. న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలుజేసిన ‘ఏడీఎం జబల్పూర్‌’ కేసులో నాలుగు దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు సరిగ్గా ఇవ్వాళ్టి రోజే తీర్పు వెలువరించింది. ప్రజాస్వామ్యవాదుల, స్వేచ్ఛాకాముకుల విశ్వాసాలపై బలంగా దెబ్బకొడుతూ భారత దేశపు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు- ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరిణామక్రమంలో ప్రజల పక్షాన అద్భుతమైన తీర్పులు వెలువరిస్తున్న న్యాయవ్యవస్థకు చెడ్డపేరు తీసుకువచ్చిన ఆ తీర్పును మననం చేసుకోవడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది- రాజకీయ కారణాలతో ప్రభావితం కాకుండా తీర్పులు వెలువరించాల్సిన అవసరాన్ని పునస్మరించుకోవడం. రెండోది- నలుగురు న్యాయమూర్తులు ఒకవైపు నిలిచినా, తాను ఒక్కడే సత్యంవైపు నిలిచి ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా నిర్భయంగా ‘మైనారిటీ తీర్పు’ ప్రకటించిన జస్టిస్‌ హన్స్‌రాజ్‌ ఖన్నా ప్రతిభను, ధైర్యాన్ని, ఆయనకు న్యాయనిపుణులు ఇచ్చిన గౌరవాన్ని తెలియచెప్పడం!
ఆత్యయిక పరిస్థితి చీకటి రోజుల్లో అడ్డూఆపూ లేకుండా అక్రమ నిర్బంధాలు జరిగాయి. విపక్షాలకు చెందిన రాజకీయ నాయకులను, వారి అనుచరులను ఎటువంటి విచారణ లేకుండా నెలల తరబడి జైలులో ఉంచే అవకాశం ప్రభుత్వానికి వచ్చింది. చట్టసభలు నిర్వీర్యమై, ప్రభుత్వ పోలీసు యంత్రాంగాలు యథేచ్ఛగా జులుం ప్రదర్శిస్తున్నప్పుడు, కొందరు ఆశావాదులు రాష్ట్రాల్లోని హైకోర్టులను ఆశ్రయించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను ప్రశ్నించే హక్కు పౌరులకు లేదు అని అప్పటికే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేసి ఉన్నారు. కాబట్టి తమ అరెస్టులను ప్రశ్నిస్తూ హెబియస్‌ కార్పస్‌ రిట్‌ కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పౌరులకు లేదన్నది ఏలినవారి వాదన. ఆ వాదనతో రాష్ట్రాల్లోని ఏ హైకోర్టూ ఏకీభవించలేదు. అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడూ హెబియస్‌ కార్పస్‌ రిట్‌ జారీ చేయవచ్చు అని స్పష్టం చేస్తూ రాష్ట్రాల్లోని సర్వోన్నత న్యాయస్థానాలు తీర్పులు వెలువరించాయి.
హైకోర్టుల తీర్పును జీర్ణించుకోలేని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. అన్ని అప్పీళ్లనూ అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించారు. వాదనలు వింటున్న సమయంలో జస్టిస్‌ ఖన్నా ‘ఎమర్జెన్సీ కాలంలో పౌరులను పోలీసులు చంపివేసినా కోర్టులు ఏమీ చేయలేవా?’ అని అడ్వకేట్‌ జనరల్‌ని ప్రశ్నిస్తే, ఆయన ‘ఏమీ చేయలేవు’ అని సమాధానమిచ్చారు. అలాంటి జవాబు ప్రభుత్వంవైపునుంచి విన్న తరవాత కూడా సర్కారీ వాదనను సమర్థిస్తూ 4:1 మెజారిటీతో ధర్మాసనం అప్పట్లో తీర్పు ప్రకటించడం గమనార్హం. ప్రజాస్వామ్య హితైషుల ఆకాంక్షలను మంట కలుపుతూ, సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు జడ్జీలు ప్రకటించిన తీర్పు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం పౌరులను చంపివేసినా, అత్యున్నత న్యాయస్థానంతోసహా, ఏ కోర్టూ ఏమీ చేయలేదని చెప్పడంతో న్యాయ ప్రపంచం నివ్వెరపోయింది.
మెజార్టీ తీర్పు పాలకుల పక్షాన వస్తే- జస్టిస్‌ ఖన్నా గళం ఒక్కటి మాత్రం ప్రజల వైపున నిలిచింది. జీవించే హక్కు ప్రభుత్వాలు ప్రసాదించినది కాదు కాబట్టి, ఆ హక్కును హరించే హక్కు సర్కారుకు లేదంటూ ఆయన ఇచ్చిన తీర్పునకు విశేష ప్రాచుర్యం లభించింది. ‘మైనార్టీ తీర్పు’గా అది అమలుకు నోచుకోనప్పటికీ- న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, నిష్పాక్షికతకు ఆయన తీర్పు దర్పణంగా నిలిచింది. కానీ, ఆ తీర్పు జస్టిస్‌ ఖన్నాకు మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించాల్సిన తరుణంలో, ఆయనకంటే జూనియర్‌గా ఉన్న మరో వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీచేశారు. అందుకు నిరసనగా జస్టిస్‌ ఖన్నా తన పదవికి రాజీనామా చేశారు. పదవినుంచి వైదొలగినా ప్రపంచవ్యాప్తంగా నిష్పక్షపాత న్యాయానికి నిలువెత్తు రూపంగా జస్టిస్‌ ఖన్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.
గడచిన రెండున్న దశాబ్దాలుగా భారత న్యాయవ్యవస్థ ప్రజల తరఫున నిలిచి అనేక సంచలన తీర్పులు ప్రకటిస్తోంది. జస్టిస్‌ ఖన్నా వంటి మహనీయుల స్ఫూర్తితో స్వతంత్ర న్యాయవ్యవస్థ విశిష్టతను కాపాడుకునే క్రమంలో మరింత అంకితభావం ప్రదర్శించాల్సిన అవసరం కొట్టిపారేయలేనిది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులుగా అనుమానిస్తున్న వ్యక్తులకు విరివిగా బెయిళ్లు మంజూరు చేస్తున్నారనే కారణంతో పోలీసు యంత్రాంగం సమర్పించిన నివేదిక ఆధారంగా ఒక ప్రధాన జ్యుడిషియల్‌ మేజిస్ట్రేటుని ఉద్యోగం నుంచి తొలగించారన్న వార్త కలవరం కలిగిస్తోంది. జాతీయ జ్యుడిషియల్‌ అకాడెమీలో జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు ప్రసంగించడంపైనా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత ప్రధాన న్యాయమూర్తి ప్రధాని సమక్షంలో కంటతడి పెట్టిన విషయం కేవలం విచారించవలసిన విషయం కాదు- నిశితంగా చర్చించాల్సిన అంశం! దేశవ్యాప్తంగా వేలసంఖ్యలో ఉన్న న్యాయస్థానాలన్నింటిలోనూ జడ్జీలను నియమించకుండా ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను ఇరకాటంలో పెడుతున్నాయా అనే సందేహమూ కలుగుతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై పాలకులకు ఉన్న లేదా లేని అవగాహనపై చర్చ మొదలు పెట్టాల్సిన సమయమూ ఆసన్నమైంది. ప్రజల స్వేచ్ఛ, స్వతంత్రాలను హరించే; ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే విధంగా వెలువరించిన తీర్పులు న్యాయవ్యవస్థను ఏ స్థాయిలో అప్రతిష్ఠ పాలు చేస్తాయన్న విషయాన్నీ మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
- కె.పట్టాభిరామారావు 
(రచయిత- జాతీయ పోలీసు అకాడమీ ఉపసంచాలకులు)
Courtesy : ఈనాడు 

నేల... పట్టు తప్పుతున్న వేళ! 
వరస భూకంపాలు- నేర్వాల్సిన పాఠాలు 

క్కడా ఇక్కడా అనే తేడా లేకుండా వరసగా సంభవిస్తున్న పెను భూకంపాలు ప్రపంచం మొత్తానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంతరిక్షంలోని ఉపగ్రహాలను సైతం భూమ్మీదనుంచే నియంత్రించగల అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంలో పరిణతి సాధించిన మానవ మేధకు, భూమి లోపలి పొరల్లో నిత్యం చోటుచేసుకుంటున్న కదలికల గురించి అంతుచిక్కకపోవడం ఆశ్చర్యకరమే. స్వల్ప వ్యవధిలో అపార నష్టాలను తెచ్చే భూకంపాలను ముందుగానే పసిగట్టే దిశగా అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. అందులోని సంక్లిష్టతల దృష్ట్యా నిర్దిష్ట ఫలితాలు మాత్రం దక్కడం లేదు. కొన్ని సెకన్ల ముందు భూకంపాల రాకను పసిగట్టగల సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో వరస ప్రకంపనలు; జపాన్‌, ఈక్వెడార్లలో పెను భూకంపాలు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు సవాళ్లు విసురుతున్నాయి. ఏప్రిల్‌ నెల మొదటి పదహారు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 22 భూప్రకంపనలు నమోదయ్యాయి. భారత్‌లో మూడుసార్లు, భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో రెండుసార్లు నమోదైన ప్రకంపనలు మనదేశానికీ వణుకు పుట్టిస్తున్నాయి.


సంక్లిష్ట సమస్య 
ఒకచోట భూకంపం వస్తే దాని ప్రకంపనల ప్రభావం సమీప ప్రాంతాలపై ఉంటుంది. కానీ, జపాన్‌, ఈక్వెడార్లలో వచ్చిన భూకంపాలు కొత్త చర్చకు తెరతీశాయి. ఒకచోట భూకంపం వస్తే దాని ప్రభావం సుదూర ప్రాంతాలపైనా పడే అవకాశాలు ఉన్నాయని అమెరికా భూవిజ్ఞాన సర్వేక్షణ సంస్థ చెబుతోంది. అందుకు దాఖలాగా జపాన్‌, ఈక్వెడార్‌ భూకంపాలను చూపుతోంది. రెండు దేశాల మధ్య 15,445 కిలోమీటర్ల దూరం ఉంది. తొలుత ఏప్రిల్‌ 15న జపాన్‌లో రిక్టర్‌ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. గంటల వ్యవధిలో ఈక్వెడార్‌ను 7.8 తీవ్రతతో పెను భూకంపం కుదిపేసింది. ఈ రెండు భూకంపాలూ ‘పసిఫిక్‌ అగ్నివలయం’లోనే సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం భూకంపాల్లో 98శాతం ఇక్కడే వస్తుంటాయి. విస్ఫోటక అగ్ని పర్వతాలు, భూకంప క్రియాశీలతకు ఈ ప్రాంతం నిలయం. ఈక్వెడార్‌లో భూకంపం ధాటికి పసిఫిక్‌ తీరంలోని పట్టణాలన్నీ దెబ్బతిన్నాయి. వందల మైళ్ల దూరంలోని రాజధాని క్విటో, వాణిజ్య నగరం గువాయాక్విల్‌ నగరాలనూ ప్రకంపనలు భీతిల్లజేశాయి. ప్రధాన భూకంపం తరవాతా 55సార్లు చిన్నపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. భూపొరల్లో సర్దుబాట్లు ఏ రీతిగా ఉన్నాయో దీన్నిబట్టి అవగతమవుతోంది. తాజా భూకంప ప్రాంతం నుంచి దక్షిణాన 43కి.మీ. దూరంలో సరిగ్గా 74ఏళ్ల క్రితం 1942 మే 14న రిక్టర్‌ స్కేలుపై 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. జపాన్‌లోనూ వరసగా రెండు రోజులు మొదట 6.1 తీవ్రతతో, మరుసటి రోజు 7.0 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. రెండు దేశాల్లో ఘటనల సామీప్యత, క్రమానుగత సంబంధం కారణాలవల్ల మరింత లోతైన అధ్యయనాలు జరపాల్సిన అవసరం ఏర్పడింది.

అమెరికా భూవిజ్ఞాన సంస్థ అధ్యయనం ప్రకారం రిక్టర్‌ స్కేలుపై 7.0 నుంచి 7.9 తీవ్రతతో కూడిన భూకంపాలు ఏటా 15సార్లు సంభవిస్తాయి. అత్యంత శక్తిమంతమైన 8.0 తీవ్రతగల భూకంపాలు ఏటా ఒకసారి ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల భూప్రకంపనలు సంభవిస్తూనే ఉంటాయి. వాటిలో చాలావరకు అత్యల్ప తీవ్రత కలిగినవి. వాటిని గుర్తించడం కుదరదు. శక్తిమంతమైన తీవ్రత భూకంపాలను గుర్తించేలోపే క్షణాల్లో అది పెను విధ్వంసం సృష్టిస్తుంది. భారత ఉపఖండంలోనూ భూప్రకంపనలు తరచూ నమోదవుతున్నాయి. పెను భూకంపం ఎప్పుడు ఎక్కడ విరుచుకుపడుతోందన్న ఆందోళన భారత్‌ను కొంతకాలంగా కలవరపాటుకు గురిచేస్తోంది. దేశంలో 59శాతం భూకంపం రావడానికి అవకాశం ఉన్న ప్రాంతమే. నేపాల్‌ పెను భూకంపం విధ్వంసం అనంతరం పరిస్థితులను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిపుణులు విశ్లేషించారు. ఉత్తర భారతంలోని పర్వత సానువుల చుట్టూ ఉన్న ప్రాంతమంతటా భారీ భూకంపాల ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో హిమాలయాల ప్రాంతంలో అతి భారీ భూకంపం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్న కేంద్ర విపత్తుల నిర్వహణ బృందం, రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 8.2గా ఉండొచ్చని అంచనా వేసింది. నిరుడు 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపమే తీవ్ర విధ్వంసాన్ని సృష్టించి నేపాల్‌ను మరుభూమిగా మార్చేసింది. ఈసారి మనదేశంలో 8.2 తీవ్రత భూకంపం వస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో వూహకు అందదు. భూ అంతర్భాగంలోని పలకల స్థానం భ్రంశం రేటు, దిశ, గమ్యం తదితర అంశాలను కచ్చితంగా అంచనా వేయలేకపోవడమే ప్రధాన లోపం. భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉందంటూ హెచ్చరికలు వెలువడిన నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో కేంద్రసర్కారు 11 పర్వత ప్రాంతీయ రాష్ట్రాల సదస్సు నిర్వహించింది. నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, భారత్‌లోని హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలన్నింటికీ భారీ ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి పర్వత ప్రాంతాల్లో భవనాలు భూకంపాలను తట్టుకొనే విధంగా నిర్మించాలన్న కేంద్రప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. నేపాల్‌ భూకంపం తరవాత మొట్టమొదటిసారిగా భారత్‌లో భూకంప తరంగాలను ముందస్తుగా గుర్తించి హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను ఉత్తరాఖండ్‌లో నెలకొల్పారు. భూకంప పరిశోధనల్లో ఇది ఓ ముందడుగే. కాకపోతే భూకంపం రావడానికి కేవలం నలభై సెకనుల ముందు మాత్రమే హెచ్చరికల సమాచారాన్ని ఈ కేంద్రం అందజేయగలుగుతుంది. అదీ అయిదు, అంతకుమించిన పాయింట్ల తీవ్రతగల భూకంపాల సమాచారాన్ని పసిగడుతుంది. భూకంప సమయంలో ఉద్భవించే ప్రాథమిక తరంగాలు (పి) అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. కాబట్టి సెన్సర్లు ముందుగా ‘పి’ తరంగాలను పసిగట్టి సమాచారాన్ని ఇచ్చి అప్రమత్తం చేస్తాయి. వీటి వెనకే వచ్చే ద్వితీయ తరంగాలు (ఎస్‌) అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి భారీ నష్టాల్ని కలిగించి విధ్వంసాలు సృష్టిస్తాయి. ‘స్పేస్‌ డైనమిక్స్‌’ అనే ఇటలీ సంస్థ ఇప్పటికే ఇలాంటి ముందస్తు భూకంప హెచ్చరికల వ్యవస్థను జపాన్‌, ఇటలీ, అమెరికా దేశాల్లో ఏర్పాటు చేసింది. నిరుడు ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటైంది. ప్రపంచంలోని ఇతర దేశాలు వినియోగిస్తున్న వ్యవస్థలన్నింటికన్నా ముందస్తుగా భూకంపాల రాకను పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం ఈ కేంద్రం ప్రత్యేకత. భారత్‌ ఈ ఏడాది జర్మనీకి చెందిన ‘సెక్టీ ఎలక్ట్రానిక్స్‌’ సంస్థ సహకారంతో మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది.

అధునాతన వ్యవస్థే దిక్కు 

ఆకస్మికంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో అత్యధిక స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమయ్యేవి భూకంపాలే. ప్రస్తుతం అనేక దేశాల్లో భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెరికా భూవిజ్ఞాన పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో 2006 నుంచే ఈ వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతోంది. భారత్‌లో ఇటీవలే దీన్ని ఏర్పాటు చేయడం వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది. భారత్‌ ఈ దిశగా పరిశోధనలు జరిపి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాలిఫోర్నియాలో వినియోగిస్తున్న ఆధునిక ‘షేక్‌ అలర్ట్‌’ వ్యవస్థ తరహా భూకంప హెచ్చరిక-అప్రమత్త వ్యవస్థను భారత్‌లో సైతం వినియోగించుకునే దిశగా కృషి జరగాలి. జపాన్‌తోపాటు నేపాల్‌, ఈక్వెడార్‌, ఫిలిప్పీన్స్‌, పాకిస్థాన్‌, ఎల్‌ సాల్వడార్‌, మెక్సికో, టర్కీ, ఇండొనేసియా, భారత్‌లు అత్యంత భూకంప సంభావ్యత గల దేశాల జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా భూకంప సంభావ్యత గల ప్రధాన పట్టణాలు, ప్రాంతాల్లో హెచ్చరికల జారీ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లయితే కనీసం కొన్ని సెకన్ల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. తద్వారా కనీసం ప్రాణనష్టాలనైనా గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న భూకంపాలు, వరదలు తదితర విపత్తుల వల్ల 18,000కోట్ల డాలర్ల ఆస్తి నష్టం సంభవిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుని అప్రమత్తంగా మసలుకోవడం ద్వారానే కొంతమేరకైనా విధ్వంస తీవ్రత తగ్గించవచ్చు. జపాన్‌ తరహాలో ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి భవన నిర్మాణాల విషయంలో భూకంపాలను తట్టుకునే ఆకృతి, నిర్మాణ పద్ధతులను మనదేశమూ అభివృద్ధిపరచాలి. భవనాల పునాదులకు, ఫ్లోరింగ్‌కు మధ్య భూ ప్రకంపనలను తట్టుకునే విధంగా బేరింగులు ఏర్పాటు చేయాలి. భూకంప తీవ్రత తగ్గించేలా నిర్మాణాలు చేపట్టడానికి భారతీయ ప్రమాణాల సంస్థ సూచించిన మార్గదర్శకాలను అందరూ కచ్చితంగా పాటించేట్లు చూడాలి. జాతీయ భూకంపాల నష్ట నివారణ పథకం 2013లోని మార్గదర్శకాలు విధిగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలి. అప్పుడే సాంకేతిక పరిజ్ఞానానికి మానవ ప్రయత్నం, నష్ట నివారణ చర్యలు తోడై భూమండలానికి పొంచి ఉన్న పెను భూకంపాల ముప్పు నుంచి ప్రజలను కాపాడుకోవచ్చు!

- మనస్వి
Courtesy : ఈనాడు 

ట్టణ ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు కట్టుబాటు చాటిన చంద్రబాబు ప్రభుత్వం, విస్తృత కార్యాచరణకు సన్నద్ధమవుతోంది. రూ.9,700కోట్లకు పైగా అంచనా వ్యయంతో సుమారు లక్షా 93వేల ఇళ్ల నిర్మాణానికి దాదాపుగా మార్గం సుగమమైంది. అందులో లక్షన్నర బహుళ అంతస్తుల నివాసాలు పోను, తక్కినవి లబ్ధిదారుల సొంత స్థలంలో కట్టనున్న విడి ఇళ్లు. సమకూర్చుకున్న ఇంటి జాగా ఉండీ ఆర్థిక సత్తా కరవైన వ్యక్తులు, బ్యాంకు రుణం రూ.90వేలు సహా మొత్తం లక్షరూపాయలు భరించగలిగితే- రాష్ట్రప్రభుత్వం లక్ష, కేంద్రం మరో లక్షన్నర రూపాయల మేర సబ్సిడీగా సమకూరుస్తాయంటున్నారు. నిర్మాణ బాధ్యత లబ్ధిదారులదే! బహుళ అంతస్తుల ఇళ్లకైతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సబ్సిడీ చెరో లక్షన్నరకు అదనంగా లబ్ధిదారులపై పడే భారం రూ.2.5లక్షలు. అందులో రెండు లక్షల 40వేల రూపాయలదాకా బ్యాంకు రుణంగా పొందగల వీలుండటం- గూడు లేని పట్టణ పౌరులకు గొప్ప వూరట. మొత్తం పథకం అమలుకయ్యే వ్యయభారంలో లబ్ధిదారుల నికర వాటా సుమారు 42శాతం; రాయితీ రూపేణా కేంద్రం దాదాపు 30శాతం, తక్కింది రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కలు నిక్కచ్చిగా కనిపిస్తున్నా, లబ్ధిదారుల ఎంపిక లగాయతు పారదర్శక వ్యవహార సరళి- పథకం సాఫల్యానికి ప్రాణావసరం. కాంగ్రెస్‌ పదేళ్ల ఏలుబడిలో కోటి గృహాల నిమిత్తం మంజూరైన రూ.42వేల కోట్లలో ఖర్చుపెట్టింది రూ.12వేల కోట్లేనని, అందులో మూడోవంతుకు పైగా దళారుల పాలబడిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కట్టామన్న పద్నాలుగున్నర లక్షల ఇళ్లకు ఎక్కడా ఎటువంటి ఆనవాళ్లూ లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల స్వయంగా చెప్పిందే. కొత్తగా తలపెట్టిన పట్టణ గృహనిర్మాణ యోజనలో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకూ తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తేనే, ప్రాథమిక గండం గడచి గట్టెక్కినట్లు!
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ గృహనిర్మాణం తలపెట్టినా సింగపూర్‌, హాంకాంగ్‌, చైనాల్లో అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకోవాలని అధికార యంత్రాంగానికి ఆరునెలల క్రితమే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఇళ్లనిర్మాణం వేగంగా పూర్తవ్వాలని, నాణ్యంగా ఉండాలని గిరిగీశారు. ఆంధ్రప్రదేశ్‌ గృహనిర్మాణ నమూనా దేశానికే ఆదర్శప్రాయం కావాలన్న ఆయన మనోవాంఛా ఫలసిద్ధి కోసం, అడుగడుగునా ఎన్నో జాగ్రత్తలు తప్పనిసరి. టెండర్ల ప్రక్రియ ద్వారా గుత్తేదారులకు బహుళ అంతస్తు నిర్మాణాల బాధ్యత దఖలుపరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏ దశలోనూ అవినీతి చొరబడకుండా కాచుకోవడంతోపాటు, పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణతోనే పథకం సజావుగా సాగుతుంది. కనీస జాగ్రత్తల్ని గాలికి వదిలేస్తే వాటిల్లే దుష్పరిణామాలను ‘రాజీవ్‌ స్వగృహ’ రసాభాస ఇప్పటికే కళ్లకు కట్టింది. మధ్యతరగతి కుటుంబాలకు మార్కెట్‌ ధరకన్నా 25శాతం తక్కువకే ఇళ్లు కట్టిస్తామంటూ నాడు వై.ఎస్‌. సర్కారు ఆడంబరంగా ఆరంభించిన పథకమది. ఆ ఇళ్లను ఇప్పుడెవరూ కొనేవారు లేక వేల సంఖ్యలో ఖాళీగా పడి ఉన్నాయి. తాగునీరు, రహదారులు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకుండా కట్టిన ఆ ఇళ్లలో పాదం మోపేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలకు పట్టణ నిధులు వెచ్చించే వీల్లేక అనేక స్వగృహాలు కొరతల కొలిమిలో కుములుతున్నాయి. పకడ్బందీ ప్రణాళిక కరవై నిరుపయోగంగా మిగిలిన వేలాది ‘రాజీవ్‌ స్వగృహ’ నిర్మాణాల తరహా బాగోతాలు పునరావృతం కాకుండా, రాష్ట్రప్రభుత్వం అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంది!
రాష్ట్రంలో గూడులేని ఆరు లక్షల మంది నిరుపేదలు, అల్పాదాయ వర్గాల వారికోసం మొత్తం రూ.16వేలకోట్ల అంచనా వ్యయంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం స్వీయ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏడు వారాల క్రితం ప్రకటించారు. లక్ష్యసాధనలో విదేశాల సాంకేతిక ఒరవడిని అందిపుచ్చుకోవాలని అభిలషిస్తున్న ఆయన ప్రభుత్వం, ఆయా విజయగాథల వెనక అపారకృషి తాలూకు ప్రాముఖ్యాన్ని సంపూర్ణంగా ఆకళించుకోవాలి. ప్రజలందరికీ సొంతిళ్లు కల్పించిన అతికొద్ది దేశాల్లో ఒకటైన సింగపూర్‌ నిర్మాణ ప్రణాళిక వైశిష్ట్యం సాటిలేనిది. గృహసముదాయాలకు చేరువలో విద్యాలయాలు, పార్కులు ఏర్పరచి, ప్రధాన రహదారులతో అనుసంధానించి, పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదభరితంగా ఉండేలా తీర్చిదిద్దడంలో- ముందుచూపు, అంతకుమించి కళాత్మకత ఉట్టిపడతాయి. బహుళ అంతస్తుల పరిసర ప్రాంతాల సుందరీకరణకు స్థానికులు చొరవ చూపితే, తామే నిధులందించడం గృహవసతి పట్ల సింగపూర్‌ ప్రభుత్వ విశేష ప్రాధాన్యాన్ని చాటుతుంది. సత్వర పరిపూర్తి స్ఫూర్తికి పెద్దపీట వేయాలని నినదిస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఇక్కడి గృహనిర్మాణ పథకాలన్నింటికీ తొలుత మౌలిక సదుపాయాల పరికల్పన పూర్తయ్యాకనే- పనులకు పచ్చజెండా వూపడం మేలు. గుత్తేదారుల ప్రమేయం కలిగిన సర్కారీ పథకాల ఇంపుసొంపులపై వేరే ప్రస్తావించనక్కర్లేనంతగా లొసుగుల బాగోతాలెన్నో తెలుగు గడ్డపై పోగుపడి ఉన్నాయి. ఆ దృష్ట్యా, పనుల నాణ్యతపై సరైన పర్యవేక్షణను రాష్ట్రప్రభుత్వం ఎంత మాత్రం అలక్ష్యం చేసే వీల్లేదు. రాయితీల రూపేణా కేంద్ర రాష్ట్రప్రభుత్వాల సౌహార్దం, లబ్ధిదారుల శ్రమఫలాలతో ముడివడిన ప్రతిష్ఠాత్మక గృహనిర్మాణమిది. ఇందులో ప్రతి ఒక్క రూపాయీ సద్వినియోగమయ్యేలా పటిష్ఠ కార్యాచరణ వ్యూహాన్ని చంద్రబాబు ప్రభుత్వం సవ్యంగా పట్టాలకు ఎక్కించాలి!
Courtesy : ఈనాడు 

Sree Charan Adari

{picture#YOUR_PROFILE_PICTURE_URL} YOUR_PROFILE_DESCRIPTION {facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.