April 2016

న్యాయానికి ఒక్కడు! 
ఆత్యయిక స్థితిపై తీర్పునకు 40ఏళ్లు 
ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో భారత న్యాయ వ్యవస్థ సమున్నత సంప్రదాయాలు నెలకొల్పుతోంది. సామాజిక సంక్లిష్టతలను అర్థం చేసుకొని, పౌరుల స్వేచ్ఛకు పెద్దపీట వేస్తూ తీర్పులు ఇవ్వడంలో కాలం గడుస్తున్నకొద్దీ భారత న్యాయవ్యవస్థలు పరిణతి చెందుతున్నాయి. అత్యవసర పరిస్థితి కాలంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన ఓ తీర్పు మాత్రం అందరినీ నివ్వెరపాటుకు గురిచేసింది. సరిగ్గా నలభై సంవత్సరాల క్రితం, ఏప్రిల్‌ 28న ‘సుప్రీం’ ఇచ్చిన తీర్పు చరిత్రలో ఓ మాయనిమచ్చలా మిగిలిపోయింది. న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలుజేసిన ‘ఏడీఎం జబల్పూర్‌’ కేసులో నాలుగు దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు సరిగ్గా ఇవ్వాళ్టి రోజే తీర్పు వెలువరించింది. ప్రజాస్వామ్యవాదుల, స్వేచ్ఛాకాముకుల విశ్వాసాలపై బలంగా దెబ్బకొడుతూ భారత దేశపు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు- ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పరిణామక్రమంలో ప్రజల పక్షాన అద్భుతమైన తీర్పులు వెలువరిస్తున్న న్యాయవ్యవస్థకు చెడ్డపేరు తీసుకువచ్చిన ఆ తీర్పును మననం చేసుకోవడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది- రాజకీయ కారణాలతో ప్రభావితం కాకుండా తీర్పులు వెలువరించాల్సిన అవసరాన్ని పునస్మరించుకోవడం. రెండోది- నలుగురు న్యాయమూర్తులు ఒకవైపు నిలిచినా, తాను ఒక్కడే సత్యంవైపు నిలిచి ఎటువంటి ప్రభావాలకు లొంగకుండా నిర్భయంగా ‘మైనారిటీ తీర్పు’ ప్రకటించిన జస్టిస్‌ హన్స్‌రాజ్‌ ఖన్నా ప్రతిభను, ధైర్యాన్ని, ఆయనకు న్యాయనిపుణులు ఇచ్చిన గౌరవాన్ని తెలియచెప్పడం!
ఆత్యయిక పరిస్థితి చీకటి రోజుల్లో అడ్డూఆపూ లేకుండా అక్రమ నిర్బంధాలు జరిగాయి. విపక్షాలకు చెందిన రాజకీయ నాయకులను, వారి అనుచరులను ఎటువంటి విచారణ లేకుండా నెలల తరబడి జైలులో ఉంచే అవకాశం ప్రభుత్వానికి వచ్చింది. చట్టసభలు నిర్వీర్యమై, ప్రభుత్వ పోలీసు యంత్రాంగాలు యథేచ్ఛగా జులుం ప్రదర్శిస్తున్నప్పుడు, కొందరు ఆశావాదులు రాష్ట్రాల్లోని హైకోర్టులను ఆశ్రయించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనను ప్రశ్నించే హక్కు పౌరులకు లేదు అని అప్పటికే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేసి ఉన్నారు. కాబట్టి తమ అరెస్టులను ప్రశ్నిస్తూ హెబియస్‌ కార్పస్‌ రిట్‌ కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పౌరులకు లేదన్నది ఏలినవారి వాదన. ఆ వాదనతో రాష్ట్రాల్లోని ఏ హైకోర్టూ ఏకీభవించలేదు. అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడూ హెబియస్‌ కార్పస్‌ రిట్‌ జారీ చేయవచ్చు అని స్పష్టం చేస్తూ రాష్ట్రాల్లోని సర్వోన్నత న్యాయస్థానాలు తీర్పులు వెలువరించాయి.
హైకోర్టుల తీర్పును జీర్ణించుకోలేని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. అన్ని అప్పీళ్లనూ అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించారు. వాదనలు వింటున్న సమయంలో జస్టిస్‌ ఖన్నా ‘ఎమర్జెన్సీ కాలంలో పౌరులను పోలీసులు చంపివేసినా కోర్టులు ఏమీ చేయలేవా?’ అని అడ్వకేట్‌ జనరల్‌ని ప్రశ్నిస్తే, ఆయన ‘ఏమీ చేయలేవు’ అని సమాధానమిచ్చారు. అలాంటి జవాబు ప్రభుత్వంవైపునుంచి విన్న తరవాత కూడా సర్కారీ వాదనను సమర్థిస్తూ 4:1 మెజారిటీతో ధర్మాసనం అప్పట్లో తీర్పు ప్రకటించడం గమనార్హం. ప్రజాస్వామ్య హితైషుల ఆకాంక్షలను మంట కలుపుతూ, సుప్రీంకోర్టుకు చెందిన నలుగురు జడ్జీలు ప్రకటించిన తీర్పు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వం పౌరులను చంపివేసినా, అత్యున్నత న్యాయస్థానంతోసహా, ఏ కోర్టూ ఏమీ చేయలేదని చెప్పడంతో న్యాయ ప్రపంచం నివ్వెరపోయింది.
మెజార్టీ తీర్పు పాలకుల పక్షాన వస్తే- జస్టిస్‌ ఖన్నా గళం ఒక్కటి మాత్రం ప్రజల వైపున నిలిచింది. జీవించే హక్కు ప్రభుత్వాలు ప్రసాదించినది కాదు కాబట్టి, ఆ హక్కును హరించే హక్కు సర్కారుకు లేదంటూ ఆయన ఇచ్చిన తీర్పునకు విశేష ప్రాచుర్యం లభించింది. ‘మైనార్టీ తీర్పు’గా అది అమలుకు నోచుకోనప్పటికీ- న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, నిష్పాక్షికతకు ఆయన తీర్పు దర్పణంగా నిలిచింది. కానీ, ఆ తీర్పు జస్టిస్‌ ఖన్నాకు మాత్రం చేదు అనుభవం మిగిల్చింది. సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించాల్సిన తరుణంలో, ఆయనకంటే జూనియర్‌గా ఉన్న మరో వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీచేశారు. అందుకు నిరసనగా జస్టిస్‌ ఖన్నా తన పదవికి రాజీనామా చేశారు. పదవినుంచి వైదొలగినా ప్రపంచవ్యాప్తంగా నిష్పక్షపాత న్యాయానికి నిలువెత్తు రూపంగా జస్టిస్‌ ఖన్నా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.
గడచిన రెండున్న దశాబ్దాలుగా భారత న్యాయవ్యవస్థ ప్రజల తరఫున నిలిచి అనేక సంచలన తీర్పులు ప్రకటిస్తోంది. జస్టిస్‌ ఖన్నా వంటి మహనీయుల స్ఫూర్తితో స్వతంత్ర న్యాయవ్యవస్థ విశిష్టతను కాపాడుకునే క్రమంలో మరింత అంకితభావం ప్రదర్శించాల్సిన అవసరం కొట్టిపారేయలేనిది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులుగా అనుమానిస్తున్న వ్యక్తులకు విరివిగా బెయిళ్లు మంజూరు చేస్తున్నారనే కారణంతో పోలీసు యంత్రాంగం సమర్పించిన నివేదిక ఆధారంగా ఒక ప్రధాన జ్యుడిషియల్‌ మేజిస్ట్రేటుని ఉద్యోగం నుంచి తొలగించారన్న వార్త కలవరం కలిగిస్తోంది. జాతీయ జ్యుడిషియల్‌ అకాడెమీలో జరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు ప్రసంగించడంపైనా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత ప్రధాన న్యాయమూర్తి ప్రధాని సమక్షంలో కంటతడి పెట్టిన విషయం కేవలం విచారించవలసిన విషయం కాదు- నిశితంగా చర్చించాల్సిన అంశం! దేశవ్యాప్తంగా వేలసంఖ్యలో ఉన్న న్యాయస్థానాలన్నింటిలోనూ జడ్జీలను నియమించకుండా ప్రభుత్వాలు న్యాయవ్యవస్థను ఇరకాటంలో పెడుతున్నాయా అనే సందేహమూ కలుగుతుంది. న్యాయవ్యవస్థ స్వతంత్రతపై పాలకులకు ఉన్న లేదా లేని అవగాహనపై చర్చ మొదలు పెట్టాల్సిన సమయమూ ఆసన్నమైంది. ప్రజల స్వేచ్ఛ, స్వతంత్రాలను హరించే; ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే విధంగా వెలువరించిన తీర్పులు న్యాయవ్యవస్థను ఏ స్థాయిలో అప్రతిష్ఠ పాలు చేస్తాయన్న విషయాన్నీ మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
- కె.పట్టాభిరామారావు 
(రచయిత- జాతీయ పోలీసు అకాడమీ ఉపసంచాలకులు)
Courtesy : ఈనాడు 

నేల... పట్టు తప్పుతున్న వేళ! 
వరస భూకంపాలు- నేర్వాల్సిన పాఠాలు 

క్కడా ఇక్కడా అనే తేడా లేకుండా వరసగా సంభవిస్తున్న పెను భూకంపాలు ప్రపంచం మొత్తానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంతరిక్షంలోని ఉపగ్రహాలను సైతం భూమ్మీదనుంచే నియంత్రించగల అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంలో పరిణతి సాధించిన మానవ మేధకు, భూమి లోపలి పొరల్లో నిత్యం చోటుచేసుకుంటున్న కదలికల గురించి అంతుచిక్కకపోవడం ఆశ్చర్యకరమే. స్వల్ప వ్యవధిలో అపార నష్టాలను తెచ్చే భూకంపాలను ముందుగానే పసిగట్టే దిశగా అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. అందులోని సంక్లిష్టతల దృష్ట్యా నిర్దిష్ట ఫలితాలు మాత్రం దక్కడం లేదు. కొన్ని సెకన్ల ముందు భూకంపాల రాకను పసిగట్టగల సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. కొన్ని రోజులుగా వివిధ దేశాల్లో వరస ప్రకంపనలు; జపాన్‌, ఈక్వెడార్లలో పెను భూకంపాలు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు సవాళ్లు విసురుతున్నాయి. ఏప్రిల్‌ నెల మొదటి పదహారు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 22 భూప్రకంపనలు నమోదయ్యాయి. భారత్‌లో మూడుసార్లు, భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లో రెండుసార్లు నమోదైన ప్రకంపనలు మనదేశానికీ వణుకు పుట్టిస్తున్నాయి.


సంక్లిష్ట సమస్య 
ఒకచోట భూకంపం వస్తే దాని ప్రకంపనల ప్రభావం సమీప ప్రాంతాలపై ఉంటుంది. కానీ, జపాన్‌, ఈక్వెడార్లలో వచ్చిన భూకంపాలు కొత్త చర్చకు తెరతీశాయి. ఒకచోట భూకంపం వస్తే దాని ప్రభావం సుదూర ప్రాంతాలపైనా పడే అవకాశాలు ఉన్నాయని అమెరికా భూవిజ్ఞాన సర్వేక్షణ సంస్థ చెబుతోంది. అందుకు దాఖలాగా జపాన్‌, ఈక్వెడార్‌ భూకంపాలను చూపుతోంది. రెండు దేశాల మధ్య 15,445 కిలోమీటర్ల దూరం ఉంది. తొలుత ఏప్రిల్‌ 15న జపాన్‌లో రిక్టర్‌ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. గంటల వ్యవధిలో ఈక్వెడార్‌ను 7.8 తీవ్రతతో పెను భూకంపం కుదిపేసింది. ఈ రెండు భూకంపాలూ ‘పసిఫిక్‌ అగ్నివలయం’లోనే సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం భూకంపాల్లో 98శాతం ఇక్కడే వస్తుంటాయి. విస్ఫోటక అగ్ని పర్వతాలు, భూకంప క్రియాశీలతకు ఈ ప్రాంతం నిలయం. ఈక్వెడార్‌లో భూకంపం ధాటికి పసిఫిక్‌ తీరంలోని పట్టణాలన్నీ దెబ్బతిన్నాయి. వందల మైళ్ల దూరంలోని రాజధాని క్విటో, వాణిజ్య నగరం గువాయాక్విల్‌ నగరాలనూ ప్రకంపనలు భీతిల్లజేశాయి. ప్రధాన భూకంపం తరవాతా 55సార్లు చిన్నపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. భూపొరల్లో సర్దుబాట్లు ఏ రీతిగా ఉన్నాయో దీన్నిబట్టి అవగతమవుతోంది. తాజా భూకంప ప్రాంతం నుంచి దక్షిణాన 43కి.మీ. దూరంలో సరిగ్గా 74ఏళ్ల క్రితం 1942 మే 14న రిక్టర్‌ స్కేలుపై 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. జపాన్‌లోనూ వరసగా రెండు రోజులు మొదట 6.1 తీవ్రతతో, మరుసటి రోజు 7.0 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. రెండు దేశాల్లో ఘటనల సామీప్యత, క్రమానుగత సంబంధం కారణాలవల్ల మరింత లోతైన అధ్యయనాలు జరపాల్సిన అవసరం ఏర్పడింది.

అమెరికా భూవిజ్ఞాన సంస్థ అధ్యయనం ప్రకారం రిక్టర్‌ స్కేలుపై 7.0 నుంచి 7.9 తీవ్రతతో కూడిన భూకంపాలు ఏటా 15సార్లు సంభవిస్తాయి. అత్యంత శక్తిమంతమైన 8.0 తీవ్రతగల భూకంపాలు ఏటా ఒకసారి ఏదో ఒక ప్రాంతంలో సంభవిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల భూప్రకంపనలు సంభవిస్తూనే ఉంటాయి. వాటిలో చాలావరకు అత్యల్ప తీవ్రత కలిగినవి. వాటిని గుర్తించడం కుదరదు. శక్తిమంతమైన తీవ్రత భూకంపాలను గుర్తించేలోపే క్షణాల్లో అది పెను విధ్వంసం సృష్టిస్తుంది. భారత ఉపఖండంలోనూ భూప్రకంపనలు తరచూ నమోదవుతున్నాయి. పెను భూకంపం ఎప్పుడు ఎక్కడ విరుచుకుపడుతోందన్న ఆందోళన భారత్‌ను కొంతకాలంగా కలవరపాటుకు గురిచేస్తోంది. దేశంలో 59శాతం భూకంపం రావడానికి అవకాశం ఉన్న ప్రాంతమే. నేపాల్‌ పెను భూకంపం విధ్వంసం అనంతరం పరిస్థితులను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నిపుణులు విశ్లేషించారు. ఉత్తర భారతంలోని పర్వత సానువుల చుట్టూ ఉన్న ప్రాంతమంతటా భారీ భూకంపాల ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో హిమాలయాల ప్రాంతంలో అతి భారీ భూకంపం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్న కేంద్ర విపత్తుల నిర్వహణ బృందం, రిక్టర్‌ స్కేలుపై దాని తీవ్రత 8.2గా ఉండొచ్చని అంచనా వేసింది. నిరుడు 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపమే తీవ్ర విధ్వంసాన్ని సృష్టించి నేపాల్‌ను మరుభూమిగా మార్చేసింది. ఈసారి మనదేశంలో 8.2 తీవ్రత భూకంపం వస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో వూహకు అందదు. భూ అంతర్భాగంలోని పలకల స్థానం భ్రంశం రేటు, దిశ, గమ్యం తదితర అంశాలను కచ్చితంగా అంచనా వేయలేకపోవడమే ప్రధాన లోపం. భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉందంటూ హెచ్చరికలు వెలువడిన నేపథ్యంలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో కేంద్రసర్కారు 11 పర్వత ప్రాంతీయ రాష్ట్రాల సదస్సు నిర్వహించింది. నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌, భారత్‌లోని హిమాలయ పర్వత శ్రేణులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలన్నింటికీ భారీ ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి పర్వత ప్రాంతాల్లో భవనాలు భూకంపాలను తట్టుకొనే విధంగా నిర్మించాలన్న కేంద్రప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. నేపాల్‌ భూకంపం తరవాత మొట్టమొదటిసారిగా భారత్‌లో భూకంప తరంగాలను ముందస్తుగా గుర్తించి హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను ఉత్తరాఖండ్‌లో నెలకొల్పారు. భూకంప పరిశోధనల్లో ఇది ఓ ముందడుగే. కాకపోతే భూకంపం రావడానికి కేవలం నలభై సెకనుల ముందు మాత్రమే హెచ్చరికల సమాచారాన్ని ఈ కేంద్రం అందజేయగలుగుతుంది. అదీ అయిదు, అంతకుమించిన పాయింట్ల తీవ్రతగల భూకంపాల సమాచారాన్ని పసిగడుతుంది. భూకంప సమయంలో ఉద్భవించే ప్రాథమిక తరంగాలు (పి) అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. కాబట్టి సెన్సర్లు ముందుగా ‘పి’ తరంగాలను పసిగట్టి సమాచారాన్ని ఇచ్చి అప్రమత్తం చేస్తాయి. వీటి వెనకే వచ్చే ద్వితీయ తరంగాలు (ఎస్‌) అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి భారీ నష్టాల్ని కలిగించి విధ్వంసాలు సృష్టిస్తాయి. ‘స్పేస్‌ డైనమిక్స్‌’ అనే ఇటలీ సంస్థ ఇప్పటికే ఇలాంటి ముందస్తు భూకంప హెచ్చరికల వ్యవస్థను జపాన్‌, ఇటలీ, అమెరికా దేశాల్లో ఏర్పాటు చేసింది. నిరుడు ఉత్తరాఖండ్‌లోనూ ఇలాంటి కేంద్రం ఏర్పాటైంది. ప్రపంచంలోని ఇతర దేశాలు వినియోగిస్తున్న వ్యవస్థలన్నింటికన్నా ముందస్తుగా భూకంపాల రాకను పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం ఈ కేంద్రం ప్రత్యేకత. భారత్‌ ఈ ఏడాది జర్మనీకి చెందిన ‘సెక్టీ ఎలక్ట్రానిక్స్‌’ సంస్థ సహకారంతో మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటోంది.

అధునాతన వ్యవస్థే దిక్కు 

ఆకస్మికంగా సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో అత్యధిక స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమయ్యేవి భూకంపాలే. ప్రస్తుతం అనేక దేశాల్లో భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెరికా భూవిజ్ఞాన పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో 2006 నుంచే ఈ వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతోంది. భారత్‌లో ఇటీవలే దీన్ని ఏర్పాటు చేయడం వెనుకబాటుతనాన్ని సూచిస్తుంది. భారత్‌ ఈ దిశగా పరిశోధనలు జరిపి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాలిఫోర్నియాలో వినియోగిస్తున్న ఆధునిక ‘షేక్‌ అలర్ట్‌’ వ్యవస్థ తరహా భూకంప హెచ్చరిక-అప్రమత్త వ్యవస్థను భారత్‌లో సైతం వినియోగించుకునే దిశగా కృషి జరగాలి. జపాన్‌తోపాటు నేపాల్‌, ఈక్వెడార్‌, ఫిలిప్పీన్స్‌, పాకిస్థాన్‌, ఎల్‌ సాల్వడార్‌, మెక్సికో, టర్కీ, ఇండొనేసియా, భారత్‌లు అత్యంత భూకంప సంభావ్యత గల దేశాల జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా భూకంప సంభావ్యత గల ప్రధాన పట్టణాలు, ప్రాంతాల్లో హెచ్చరికల జారీ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లయితే కనీసం కొన్ని సెకన్ల ముందైనా ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. తద్వారా కనీసం ప్రాణనష్టాలనైనా గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న భూకంపాలు, వరదలు తదితర విపత్తుల వల్ల 18,000కోట్ల డాలర్ల ఆస్తి నష్టం సంభవిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకుని అప్రమత్తంగా మసలుకోవడం ద్వారానే కొంతమేరకైనా విధ్వంస తీవ్రత తగ్గించవచ్చు. జపాన్‌ తరహాలో ఆధునిక పరిజ్ఞానాన్ని మేళవించి భవన నిర్మాణాల విషయంలో భూకంపాలను తట్టుకునే ఆకృతి, నిర్మాణ పద్ధతులను మనదేశమూ అభివృద్ధిపరచాలి. భవనాల పునాదులకు, ఫ్లోరింగ్‌కు మధ్య భూ ప్రకంపనలను తట్టుకునే విధంగా బేరింగులు ఏర్పాటు చేయాలి. భూకంప తీవ్రత తగ్గించేలా నిర్మాణాలు చేపట్టడానికి భారతీయ ప్రమాణాల సంస్థ సూచించిన మార్గదర్శకాలను అందరూ కచ్చితంగా పాటించేట్లు చూడాలి. జాతీయ భూకంపాల నష్ట నివారణ పథకం 2013లోని మార్గదర్శకాలు విధిగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలి. అప్పుడే సాంకేతిక పరిజ్ఞానానికి మానవ ప్రయత్నం, నష్ట నివారణ చర్యలు తోడై భూమండలానికి పొంచి ఉన్న పెను భూకంపాల ముప్పు నుంచి ప్రజలను కాపాడుకోవచ్చు!

- మనస్వి
Courtesy : ఈనాడు 

ట్టణ ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు కట్టుబాటు చాటిన చంద్రబాబు ప్రభుత్వం, విస్తృత కార్యాచరణకు సన్నద్ధమవుతోంది. రూ.9,700కోట్లకు పైగా అంచనా వ్యయంతో సుమారు లక్షా 93వేల ఇళ్ల నిర్మాణానికి దాదాపుగా మార్గం సుగమమైంది. అందులో లక్షన్నర బహుళ అంతస్తుల నివాసాలు పోను, తక్కినవి లబ్ధిదారుల సొంత స్థలంలో కట్టనున్న విడి ఇళ్లు. సమకూర్చుకున్న ఇంటి జాగా ఉండీ ఆర్థిక సత్తా కరవైన వ్యక్తులు, బ్యాంకు రుణం రూ.90వేలు సహా మొత్తం లక్షరూపాయలు భరించగలిగితే- రాష్ట్రప్రభుత్వం లక్ష, కేంద్రం మరో లక్షన్నర రూపాయల మేర సబ్సిడీగా సమకూరుస్తాయంటున్నారు. నిర్మాణ బాధ్యత లబ్ధిదారులదే! బహుళ అంతస్తుల ఇళ్లకైతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల సబ్సిడీ చెరో లక్షన్నరకు అదనంగా లబ్ధిదారులపై పడే భారం రూ.2.5లక్షలు. అందులో రెండు లక్షల 40వేల రూపాయలదాకా బ్యాంకు రుణంగా పొందగల వీలుండటం- గూడు లేని పట్టణ పౌరులకు గొప్ప వూరట. మొత్తం పథకం అమలుకయ్యే వ్యయభారంలో లబ్ధిదారుల నికర వాటా సుమారు 42శాతం; రాయితీ రూపేణా కేంద్రం దాదాపు 30శాతం, తక్కింది రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఈ లెక్కలు నిక్కచ్చిగా కనిపిస్తున్నా, లబ్ధిదారుల ఎంపిక లగాయతు పారదర్శక వ్యవహార సరళి- పథకం సాఫల్యానికి ప్రాణావసరం. కాంగ్రెస్‌ పదేళ్ల ఏలుబడిలో కోటి గృహాల నిమిత్తం మంజూరైన రూ.42వేల కోట్లలో ఖర్చుపెట్టింది రూ.12వేల కోట్లేనని, అందులో మూడోవంతుకు పైగా దళారుల పాలబడిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కట్టామన్న పద్నాలుగున్నర లక్షల ఇళ్లకు ఎక్కడా ఎటువంటి ఆనవాళ్లూ లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల స్వయంగా చెప్పిందే. కొత్తగా తలపెట్టిన పట్టణ గృహనిర్మాణ యోజనలో లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలకూ తావివ్వకుండా కట్టుదిట్టంగా వ్యవహరిస్తేనే, ప్రాథమిక గండం గడచి గట్టెక్కినట్లు!
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ గృహనిర్మాణం తలపెట్టినా సింగపూర్‌, హాంకాంగ్‌, చైనాల్లో అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకోవాలని అధికార యంత్రాంగానికి ఆరునెలల క్రితమే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఇళ్లనిర్మాణం వేగంగా పూర్తవ్వాలని, నాణ్యంగా ఉండాలని గిరిగీశారు. ఆంధ్రప్రదేశ్‌ గృహనిర్మాణ నమూనా దేశానికే ఆదర్శప్రాయం కావాలన్న ఆయన మనోవాంఛా ఫలసిద్ధి కోసం, అడుగడుగునా ఎన్నో జాగ్రత్తలు తప్పనిసరి. టెండర్ల ప్రక్రియ ద్వారా గుత్తేదారులకు బహుళ అంతస్తు నిర్మాణాల బాధ్యత దఖలుపరుస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏ దశలోనూ అవినీతి చొరబడకుండా కాచుకోవడంతోపాటు, పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణతోనే పథకం సజావుగా సాగుతుంది. కనీస జాగ్రత్తల్ని గాలికి వదిలేస్తే వాటిల్లే దుష్పరిణామాలను ‘రాజీవ్‌ స్వగృహ’ రసాభాస ఇప్పటికే కళ్లకు కట్టింది. మధ్యతరగతి కుటుంబాలకు మార్కెట్‌ ధరకన్నా 25శాతం తక్కువకే ఇళ్లు కట్టిస్తామంటూ నాడు వై.ఎస్‌. సర్కారు ఆడంబరంగా ఆరంభించిన పథకమది. ఆ ఇళ్లను ఇప్పుడెవరూ కొనేవారు లేక వేల సంఖ్యలో ఖాళీగా పడి ఉన్నాయి. తాగునీరు, రహదారులు, వీధిదీపాలు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకుండా కట్టిన ఆ ఇళ్లలో పాదం మోపేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం లాంటి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలకు పట్టణ నిధులు వెచ్చించే వీల్లేక అనేక స్వగృహాలు కొరతల కొలిమిలో కుములుతున్నాయి. పకడ్బందీ ప్రణాళిక కరవై నిరుపయోగంగా మిగిలిన వేలాది ‘రాజీవ్‌ స్వగృహ’ నిర్మాణాల తరహా బాగోతాలు పునరావృతం కాకుండా, రాష్ట్రప్రభుత్వం అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంది!
రాష్ట్రంలో గూడులేని ఆరు లక్షల మంది నిరుపేదలు, అల్పాదాయ వర్గాల వారికోసం మొత్తం రూ.16వేలకోట్ల అంచనా వ్యయంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం స్వీయ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏడు వారాల క్రితం ప్రకటించారు. లక్ష్యసాధనలో విదేశాల సాంకేతిక ఒరవడిని అందిపుచ్చుకోవాలని అభిలషిస్తున్న ఆయన ప్రభుత్వం, ఆయా విజయగాథల వెనక అపారకృషి తాలూకు ప్రాముఖ్యాన్ని సంపూర్ణంగా ఆకళించుకోవాలి. ప్రజలందరికీ సొంతిళ్లు కల్పించిన అతికొద్ది దేశాల్లో ఒకటైన సింగపూర్‌ నిర్మాణ ప్రణాళిక వైశిష్ట్యం సాటిలేనిది. గృహసముదాయాలకు చేరువలో విద్యాలయాలు, పార్కులు ఏర్పరచి, ప్రధాన రహదారులతో అనుసంధానించి, పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదభరితంగా ఉండేలా తీర్చిదిద్దడంలో- ముందుచూపు, అంతకుమించి కళాత్మకత ఉట్టిపడతాయి. బహుళ అంతస్తుల పరిసర ప్రాంతాల సుందరీకరణకు స్థానికులు చొరవ చూపితే, తామే నిధులందించడం గృహవసతి పట్ల సింగపూర్‌ ప్రభుత్వ విశేష ప్రాధాన్యాన్ని చాటుతుంది. సత్వర పరిపూర్తి స్ఫూర్తికి పెద్దపీట వేయాలని నినదిస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఇక్కడి గృహనిర్మాణ పథకాలన్నింటికీ తొలుత మౌలిక సదుపాయాల పరికల్పన పూర్తయ్యాకనే- పనులకు పచ్చజెండా వూపడం మేలు. గుత్తేదారుల ప్రమేయం కలిగిన సర్కారీ పథకాల ఇంపుసొంపులపై వేరే ప్రస్తావించనక్కర్లేనంతగా లొసుగుల బాగోతాలెన్నో తెలుగు గడ్డపై పోగుపడి ఉన్నాయి. ఆ దృష్ట్యా, పనుల నాణ్యతపై సరైన పర్యవేక్షణను రాష్ట్రప్రభుత్వం ఎంత మాత్రం అలక్ష్యం చేసే వీల్లేదు. రాయితీల రూపేణా కేంద్ర రాష్ట్రప్రభుత్వాల సౌహార్దం, లబ్ధిదారుల శ్రమఫలాలతో ముడివడిన ప్రతిష్ఠాత్మక గృహనిర్మాణమిది. ఇందులో ప్రతి ఒక్క రూపాయీ సద్వినియోగమయ్యేలా పటిష్ఠ కార్యాచరణ వ్యూహాన్ని చంద్రబాబు ప్రభుత్వం సవ్యంగా పట్టాలకు ఎక్కించాలి!
Courtesy : ఈనాడు 

Sree Charan Adari

{picture#YOUR_PROFILE_PICTURE_URL} YOUR_PROFILE_DESCRIPTION {facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.